హైదరాబాద్, మార్చి 9 : రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మకంగా కలకాలం నిలిచిపోతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగంలో ఉద్యోగుల పాత్ర గణనీయమైనదని ఈ వాస్తవాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి కసరత్తు చేసిన పిదప ఈ నిర్ణయాన్ని ప్రతిపాదించారని ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలులోకి తీసుకోవచ్చిన జోనల్ వ్యవస్థ వల్ల 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలోని స్థానికులకే లభిస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలలో 8 లక్షల 672 వేల ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ సర్వీసెస్ పెన్షన్ల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవల పార్లమెంటులో ప్రకటించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గుర్తుచేశారు.
అందువల్ల కేంద్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖలలో, సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను, నిరుద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వ శాఖలలో, సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ఢిల్లీలో ధర్నా చేయాలని ఆయన సూచించారు.