సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ): రైతన్నకు దన్నుగా టీఆర్ఎస్ చేపట్టిన ‘వరి’ పోరు విజయమైంది. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు గులాబీ దండు కదం తొక్కగా.. రాష్ట్ర నలుమూలల నుంచి కర్షకులు, గులాబీ సేన నగరంలోని ఇందిరాపార్కు ధర్నా చౌక్కు ఉప్పెనలా తరలివచ్చారు. వడ్లు కొనే దాకా కొట్లాడుడే.. అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పంజాబ్లో వడ్లు కొంటున్న కేంద్రం.. తెలంగాణలో ఎందుకు కొనదు..? రాష్ట్ర రైతులపై ఎందుకీ కక్ష.. అంటూ ప్రత్యేక ప్ల కార్డుల ప్రదర్శనలతో ఎండగట్టారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన నిరసనకు కేసీఆర్ నేతృత్వం వహించగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రైతుబంధు సమితి బాధ్యులు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, కర్షకులు ముక్త కంఠంతో కేంద్రం దిగిరావాలంటూ దద్దరిల్లేలా నినాదాలు చేశారు. ఢిల్లీకి సెగ తగిలేలా నిరసన తెలిపారు.
దారులన్నీ ధర్నా చౌక్ వైపే..
గ్రేటర్ వేదికగా కేంద్రానికి వడ్ల సెగ తాకింది. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఇందిరా పార్క్కు భారీ ఎత్తున తరలివచ్చారు. దారులన్నీ ధర్నా చౌక్ వైపే సాగాయి. బైక్ ర్యాలీలు, పాదయాత్రలతో తరలిరావడంతో ధర్నా చౌక్ పరిసరాలు జనసంద్రోహంగా మారాయి. ఇందిరాపార్కు నలువైపులా ఇసుకవేస్తే రాలనంత జనం తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతం టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోయింది. మొత్తంగా చాన్నాళ్ల తర్వాత ధర్నా చౌక్ ఉద్యమ రోజులను తలపించడం గమనార్హం.
రైతు ధర్నా హైలెట్స్