హైదరాబాద్ : కరోనా మహమ్మారి నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకునేందుకు రోజుకు 3 లక్షల మందికి కొవిడ్ టీకా ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రగతిభవన్ లో వైద్య ఆరోగ్యశాఖపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్నందున.. రాష్ట్రానికి సరిపడా వ్యాక్సిన్ సరఫరా అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కరోనా పూర్తి నియంత్రణలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్ లో ప్రజలకు కరోనాతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ప్రారంభమైనందున, విద్యాసంస్థల్లో కరోనా ప్రభావం పెద్దగా లేదని వైద్యాధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కరోనా ఎక్కువయ్యే అవకాశాలు కనిపించడం లేదని అధికారులు సమావేశంలో వివరించారు.
రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసుకునేందుకు 18 సంవత్సరాలు పైబడిన అర్హులు 2.80కోట్ల మంది ఉండగా, ఇప్పటికే 1.42 కోట్ల మందికి మొదటి మోతాదు వేశామని, 53లక్షల మందికి సెకండ్ డోస్ పంపిణీ పూర్తయిందని వైద్యశాఖ అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రోజుకు 3 లక్షల మందికి టీకా వేయడానికి చేపట్టే స్పెషల్ డ్రైవ్లో గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొనాలన్నారు. ఎంపీడీఓలు, డీఎల్పీఓలు, డీపీఓలు, జడ్పీ సీఈఓలు, ఇతర సిబ్బంది సమన్వయం చేస్తూ వైద్యశాఖ సిబ్బందికి సహకారం అందించి వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం చేయాలని కోరారు.
కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో గ్రామాల్లో లాక్డౌన్లు పెట్టుకోవడంతో పాటు కరోనా రోగుల కోసం కోసం స్కూళ్లలో ఐసొలేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి.. సర్పంచులు ప్రజలకు అండగా నిలిచారంటూ కేసీఆర్ అభినందించారు. అలాగే, ఇప్పుడు చేపట్టే వ్యాక్సినేషన్లో సైతం భాగస్వాములు కావాలని కోరారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం కావడానికి కలెక్టర్లు ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ను ఆదేశించారు. వ్యాక్సినేషన్ సిబ్బందికి భోజన వసతి సహా ఇతర సౌకర్యాలు కల్పించడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వ్యాక్సినేషన్ సెంటర్లుగా స్కూళ్లు, కాలేజీలు, రైతు వేదికలు తదితర ప్రభుత్వ.. ప్రైవేటు భవనాలను ఉపయోగించుకోవాలని, అవసరమైన చోట్ల టెంట్లు వేసి శిబిరాలు నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
టీకా ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిదనే విషయాన్ని ప్రజలు గమనించాలని సీఎం కోరారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో లక్షణాలు ఉండి, వెంటనే అప్రమత్తమైన వారు.. త్వరగా కోలుకున్నారని, నిర్లక్ష్యం చేసిన వారు ప్రాణాలు కోల్పోయారని నివేదికలు చెబుతున్నాయని సీఎం పేర్కొంటూ.. ఇకపై కూడా ఏమాత్రం స్వల్ప లక్షణాలున్నా సమీపంలోని పీహెచ్సీ కేంద్రాల్లో చూపించుకొని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మాస్కులు కూడా తప్పనిసరిగా ధరించాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. ఒకవేళ భవిష్యత్ లో కరోనా, ఇతరత్రా సీజనల్ వ్యాధులు సహా ఎలాంటి ఆపద వచ్చినా ప్రజలను ఆదుకోవడానికి వైద్య ఆరోగ్యశాఖ సంసిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఆక్సిజన్ ప్లాంట్స్, బెడ్స్ ఏర్పాటు విషయంలో తగు ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయరంగ అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చిందని, ఇక ముందు వైద్యం, విద్యకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలు, మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి, త్వరగా పూర్తి చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
వైద్యరంగంలో విశిష్ట సేవలందిస్తున్న నిమ్స్ దవాఖానా పరిధిలో మరో రెండు టవర్స్ నిర్మించి వైద్య సేవలను విస్తృత పరచాలని సీఎం ఆదేశించారు. శుభ్రత ఇతర సేవల విషయంలో ప్రభుత్వ ఆస్పత్రులు కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నే రీతిలో ఉండటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి మందులు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు.
సమీక్షలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగ రావు, సెక్రెటరీలు స్మితా సబర్వాల్, రాజశేఖర్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెల్త్ సెక్రెటరీ ఎస్ఏఎం రిజ్వీ, డైరెక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్ రెడ్డి, ఓఎస్డీ గంగాధర్, టీఎస్ ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్ పాల్గొన్నారు.