వికారాబాద్ : తెలంగాణలో కొత్తగా అమలవుతున్న ఆరోగ్య మహిళ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఆడబిడ్డల ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తూ.. మహిళా ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు చేస్తున్నారని సమాచార పౌర సంబంధా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాలోని పూడూరు మండలం చెన్గొముల్లో ఆరోగ్య మహిళా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో ఇప్పటి వరకు 372 మహిళా ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
జిల్లాలో దోమ, యాలాల్, రామయ్యగూడ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. నేడు కొత్తగా బంటారం, మోమిన్పేట, ధారూర్, కోటపల్లి, చెన్గోములో ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. ఈ కేంద్రాల్లో ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తారన్నారు. ఉచిత పరీక్షలు చేసి మందులు అందజేస్తారన్నారు.
అలాగే ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవించిన మహిళకు 4 విడతలుగా..మగ శిశువుకు 12 వేలు, ఆడ శిశువుకు రూ.13 వేలు. రూ.2800 విలువైన కేసీఆర్ కిట్లో 16 రకాల వస్తువులు తల్లి, బిడ్డ సంరక్షణ కోసం అందజేస్తున్నామని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో కేసిఆర్ కిట్లు ఇప్పటి వరకు 43,320 మంది బాలింతలకు అందించామని వివరాలను వెల్లడించారు.