పోలీస్, ఎక్సైజ్ అధికారులతో రేపు సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ఠ వ్యూహాన్ని రూపొందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్లో పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల మాఫియా పెచ్చుమీరుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ శాఖమంత్రి శ్రీనివాస్గౌడ్, సీఎస్ సోమేశ్ కుమార్, హోం, ఎక్సైజ్ శాఖల ప్రధాన కార్యదర్శులు, డీజీపీ మహేందర్రెడ్డి, శాంతిభద్రతల అడిషనల్ డీజీ జితేందర్, ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ అనిల్కుమార్, జోనల్ ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఎక్సైజ్శాఖ డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, జిల్లా సూపరింటెండెంట్లు, రాష్ట్ర మాదకద్రవ్యాల ప్రత్యేక టాస్ ఫోర్స్ అధికారులు తదితరులు పాల్గొంటారు. జిల్లా ఎక్సైజ్ శాఖాధికారులు తమ జిల్లాల పరిధిలో మాదకద్రవ్యాల నియంత్రణకు చేపడుతున్న చర్యలపై సమగ్ర నివేదికలతో రావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో గుడుంబా, పేకాట నియంత్రణ పటిష్టంగా అమలవుతున్నా అకడకడా తిరిగి మొదలవుతున్నట్టు సమాచారం అందుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన కఠినచర్యలపై సమావేశంలో చర్చించనున్నారు.