హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాధిస్తున్న గొప్ప ఫలితాలు ఉద్యోగుల కృషి వల్లే సాధ్యమవుతున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..
మీ అందరి కృషితోనే..
ఇతర రాష్ర్టాలు మనల్ని చూసి ఆశ్చర్యపడే పద్ధతుల్లో అన్ని డిపార్ట్మెంట్లలో ప్రగతి సాధిస్తున్నాం. మీ అందరి కృషి ఇలాగే కొనసాగిస్తే, యావత్ దేశానికే ఆదర్శమైన ఉద్యోగుల్లా తెలంగాణ ఉద్యోగులు తయారవుతారు. అత్యంత ధనికులైన ఉద్యోగులు ఎక్కడ ఉన్నరంటే తెలంగాణలో ఉన్నరని చెప్పుకొనే రోజు కూడా వస్తది. ఉత్తమమైన విధానాలు, అత్యుత్తమైన జీతాలు పొందవచ్చు. ఉత్తమమైన ప్రమోషన్ల విధానాన్ని పెట్టుకోవచ్చు. తెలంగాణ వచ్చింది.. బాగుపడుతున్నది.. ఇంకా బాగుపడుతది.. ఇదంతా మీ కృషే.. ఎవరో ఆకాశరామన్న వచ్చి చేయలే. కష్టపడ్డదంతా మీరే. ఎవరు వచ్చినా ఆశ్చర్యపడుతున్నారు. ఇవాళ జనగామ కలెక్టరేట్ చూస్తే చాలా రాష్ర్టాల్లో ఇలాంటి సెక్రటేరియట్ కూడా లేదు.
ఈ విషయం నేను చాలా గర్వంగా చెప్తున్నా. ఇంత అద్భుతమైన వసతి.. వాతావరణంతోని జనగామలో ఇలాంటి కలెక్టరేట్ వస్తదని మన జిందగీలో అనుకొన్నమా? జనగామలో ఇంత అద్భుతంగా, వైభవంగా, గొప్పగా కార్యక్రమాలు వస్తయ్.. పంటలు పండుతయ్.. ప్రజలు సంతోషంగా ఉంటరు.. భూముల ధరలు ఆకాశానికి పోతయ్ అనుకొన్నమా? ఇక్కడ మూడెకరాలున్నోడు ఇవాళ కోటీశ్వరుడు. పక్కనున్న యాదగిరిగుట్టకు పోతే పొద్దున్నో రేటు.. మధ్యాహ్నం ఓ రేటు.. సాయంత్రం ఓ రేటు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా. ఈ ధనం.. ఈ సౌభాగ్యం.. ఈ వెల్త్ ఎక్కడి నుంచి క్రియేట్ అయ్యింది. మీ అధికారులందరూ రాత్రింబవళ్లు ప్రభుత్వం ఏ కార్యక్రమం ఇచ్చినా అద్భుతంగా పని చేశారు కాబట్టే సాధ్యమైంది.
మారుమూల పనిచేస్తే అలవెన్సులు
చిన్న, చిన్న సమస్యలు ఉంటయ్. దానికే బెంబేలెత్తి, బేజారు కావద్దు. ప్రభుత్వ ఉద్యోగులకు నేను ఒక్కటే మాట చెప్తున్నా. ఉద్యమ సందర్భంలో నేను ఏ ఉద్యోగుల సమావేశానికి పోయినా చెప్పేది. ఆర్టీసీకి పోతే.. ఇది ఏపీఎస్ఆర్టీసీ కాదు.. టీఎస్ఆర్టీసీ అయితది చూసుకోండి అన్నా. ఉద్యోగుల సభకు పోతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకంటే ఎక్కువ జీతాలు వస్తయ్ మీకు.. తెలంగాణ ఏర్పడితే అంత మంచిగ ఉంటది అని చెప్పిన. అది నిజం చేసి చూపించిన.. ఇంకా పెరుగుతాయ్.. పెరిగిన కాడికే ఆగయ్. ఏం చేసుకుంటాం డబ్బు వస్తే.. మనోళ్లను మంచిగ చూసుకుంటాం. ఎంత ఆర్థికంగా బలపడితే అంత మంచిది. మన ఉద్యోగి కూడా ఆర్థికంగా మంచిగుంటే టెన్షన్ ఫ్రీ ఉంటే పిల్లలను మంచిగ చదివిపిస్తాడు. వారిని మంచి దారిలోకి తీసుకుపోతడు. మనోళ్లే కదా.. మంది కాదు కదా.. కాబట్టి ఉద్యోగులైనా, ప్రజలైనా.. ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా ఉండాలి.
నేను సీఎస్ను కూడా కోరుతున్నా. మారుమూల ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు ఉంటే వాళ్లకు ఏదైన స్పెషల్ అలవెన్సులు ఇవ్వండి. సమ్ స్పెషల్ అలవెన్స్.. ఐ డోంట్ మైండ్.. కాకపోతే వారిని కోరేది ఏందంటే భువనగిరి, మేడ్చల్, రంగారెడ్డి ఎట్లా డెవలప్మెంట్ అవుతున్నాయో భూపాలపల్లి లాంటి మారుమూల ప్రాంతం కూడా అట్లనే డెవలప్ కావాలె. అలా అయితేనే అది బంగారు తెలంగాణ. ఆంధ్రోళ్లతోని పంచాయితీ కూడా అయిపోయింది. చాలావరకు 99% అయిపోయింది. ఇంకా ఏమైనా ఉంటే కూడా ఖతం చేసుకొని అద్భుతమైన పద్ధతుల్లో రాష్ట్ర ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సంతోషంగా, కుటుంబసభ్యుల్లా కలిసి పనిచేసి అనుకొన్న గొప్ప ఆవిష్కరణ చేయాలి.
కొత్త జిల్లాలను ఆషామాషీగా చేయలేదు
ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం వేర్వేరు కాదు. ఇది మన ఇల్లు, మన రాష్ట్రం. కొత్త జోనల్ సిస్టమ్ తెచ్చుకొన్నాం. ఎందుకు తెచ్చుకొన్నాం.. మారుమూల ప్రాంతాలూ అభివృద్ధి కావాలని తెచ్చుకొన్నాం. భూపాలపల్లి, ములుగు రెండు పక్కపక్కకే ఉంటయ్. మొట్టమొదలు భూపాలపల్లి చేసుకొన్నాం. ఛత్తీస్గఢ్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఫస్ట్ సీఎస్గా పని చేశారు. తెలంగాణ రాకముందు కూడా నేను చాలా సార్లు ఆయనను అడిగిన. భూపాలపల్లి జిల్లా చేయా ల్సి వస్తున్నది. రెండే నియోజకవర్గాలు ఉంటున్నాయ్.. ఏం చేయాలని అడిగితే వైశాల్యం ఎంత ఉన్నదని అడిగిండు. ఇది చాలామందికి తెలువదు. ఏదో ఆషామాషీగా, చేయలేదు.
అవగాహనతో అభివృద్ధిని కోసం చేసుకొన్నాం. తమాషా ఏందంటే భూపాలపల్లి, ములుగు కలిపితే.. అంటే మొదటి రోజున ఏర్పాటు చేసుకొన్న భూపాలపల్లి జిల్లా పాత నిజామాబాద్ జిల్లా 9 అసెంబ్లీ నియోజకవర్గాలున్న జిల్లాలకంటే భౌగోళికంగా పెద్దది. ఈ విషయం నేను ఆయనకి చెప్తే నువ్వు వెనుక ముందుకాకు చేయ్ దాన్ని. అది నాలుగు రాష్ర్టాలు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఏపీ, తెలంగాణ మధ్యలో ఉన్నది. గోదావరి నది, అడవి ఉన్న ఆ ప్రాంతానికి అడ్మినిస్ట్రేషన్ పోవాలె. ఉద్యోగులు పోవాలె.. కలెక్టర్ పోవాలె.. ఎస్పీ పోవాలె.. అక్కడ కూడా వెలుతురు రావాలె.. గిరిజన బిడ్డలు బాగుపడాలె.. ఏం ఆలోచించకండి అని చెప్పారు. తరువాత ములుగు వాళ్లు సార్ మాది మాకు కావాలె. ఇంకా విపరీతమైన వైశాల్యం ఉన్నది.. చాలా వెనుకబాటుతనం ఉన్నది అని కోరితే, ఆలోచన చేసి మళ్లీ అదే పెద్దమనిషిని అడిగితే జిల్లా చేయాలని చెప్పారు. ములుగును జిల్లా చేసుకొన్నాం.
సర్వీస్ బుక్లు మారాలి
మీ సర్వీస్ బుక్లు ఇంతగింత దొడ్డు ఉంటయి. ఏ శాఖ ఉద్యోగి అయినా సర్వీస్ అంటే మూడు పేజీల్లో ఉండాలి. ఉద్యోగం ఎప్పుడువస్తది. ప్రమోషన్ ఎప్పుడు వస్తది. నేను ఉద్యోగంలో ఇవాళ జాయిన్ అయ్యానంటే రిటైర్ అయ్యే వరకు నా చరిత్ర నాకు తెలిసి ఉండాలె. ప్రమోషన్ రావాల్సిన రోజున వస్తది.. ప్రమోషన్ కోసం పైరవీలుచేసే దుస్థితి ఉండవద్దు. ఈ విషయంలో సీఎస్తో నేను కొట్లాడుతా ఉన్నా. మీ ఉద్యోగ సంఘాలు కూడా ఆ పనిచేయాలి. 35- 40 ఏండ్లు కష్టపడి, రాష్ట్రం కోసం పనిచేసే ఉద్యోగి పదవీ విరమణ పొందేనాటికి ఆయన రిటైర్మెంట్ ప్యాకేజీ చేతుల్లో పెట్టి, దండ వేసి, శాలువాతో సన్మానించి ప్రభుత్వ వాహనంలో ఇంటి దగ్గర దించిరావాలి. ఉద్యోగుల సర్వీస్ రూల్స్ను సరళతరం చేయాలి.
బహుముఖంగా అభివృద్ధి జరుగుతుంది
ఈ ఫలితాలు మొత్తం మీ కష్టమే. మీ చెమట బిందువులే. రాబోయే రోజుల్లో ఇంకా మల్టీఫోల్డ్, మ్యాన్ ఫోల్డ్ ఉంటది. ఈ గ్రోత్ అనేది.. అభివృద్ధి అనేది.. స్పిన్ ఆఫ్ ఎకానమీ అనేది అందరికీ అర్థం కాదు. ఒక స్టేజ్ తరువాత మల్టీ ఫోల్డ్, మ్యాన్ ఫోల్డ్ అంటే బహుముఖంగా అభివృద్ధి విస్తరిస్తది. మనమే ఊహించం. మనం అనుకోనటువంటి పనులు, అనేకమైన మంచిపనులు, అనేకమైన లక్ష్యాలు రానున్నాయి. ఏం సాధించాలన్నా ఉద్యమంలో చివరి ఘట్టంలో మీరందరూ కండ్లార చూసిండ్రు. చెవులారా విన్నరు. నేను ఫైనల్గా ఢిల్లీకి వెళ్లేముందు చెప్పిన. ఈ రోజు ఏపీ నుంచి ఢిల్లీకి పోతున్నా. తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడుతా అన్నా. అదే పద్ధతుల్లో జరిగింది. వచ్చిన తెలంగాణలో మీరు అవకాశం ఇచ్చి పరిపాలన చేయమంటే అద్భుతమైన ధనిక రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతా అని చెప్పిన. ఇవాళ ఆవిష్కరించి చూపించిన. అద్భుతాలు జరుగుతున్నయ్. జరుగకపోతే మీ జీతాలు ఎక్కడి నుంచి వస్తాయ్. కుండలో ఉంటే కదా పంచేది. ఆ కుండలోకి రావడానికి పనిచేసేది మీరే.
దేశం వచ్చి మన దగ్గర నేర్చుకొనే పరిస్థితి
ఇవాళ పంచాయతీరాజ్ అధికారులు అద్భుతంగా పనిచేసి పల్లెప్రగతితో మంచి పల్లెలను, మున్సిపల్ అధికారులు పట్టణ ప్రగతితో మంచి పట్టణాలను తయారు చేస్తున్నరు. ఇవన్నీ దేశం వచ్చి మన దగ్గర నేర్చుకొని పోయే పరిస్థితి. చిన్న చిన్న సమస్యలు వస్తాయ్. అదేం ఇష్యూ కాదు. అపోహలు పెట్టుకొని ఆగం కావొద్దు. ఏదన్నా చిన్న సమస్య ఉంటే మాట్లాడి, కూర్చొని పరిష్కారం చేసుకోవాలి. ఇంత అద్భుతమైన, విశాలమైన కార్యాలయం కట్టింది కూడా మన తెలంగాణ బిడ్డే. ఉషారెడ్డి అని అక్కడ కూర్చున్నరు. తెలంగాణకు తెలివే లేదు.. పరిపాలన రాదు.. భవనాలు కట్టరాదు అన్నోళ్లకు మనం ఏందో చేసి చూపిస్తున్నారు. ఆమె వెంబడి ఉండి ఈ భవనాలు కట్టిస్తున్న ఈఎన్సీ గణపతిరెడ్డి కూడా మన తెలంగాణ బిడ్డే. మన ఆర్కిటెక్ట్లే కష్టపడి కట్టించారు.
సీఎస్కు హృదయపూర్వక థ్యాంక్స్
రైతులు దేశానికి అన్నం పెట్టేటోళ్లు.. దేశానికి వెన్నుముక అని డైలాగులు కొట్టేటోళ్లు తప్ప.. వాళ్లకు కూసునే జాగ కూడా ఇచ్చిన దిక్కు లేకుండె. మొత్తం రాష్ర్టాన్ని 2,601 క్లస్టర్ల కింద విభజించి, కొత్త ఆఫీసర్ను ఒక ఏఈవోను పెట్టి రైతులు కూర్చొని, అక్కడే ఎక్స్చేంజ్ చేసుకొనేలా రైతు వేదిక కట్టామంటే.. నిజంగా నేను హృదయపూర్వంగా మన సీఎస్ సోమేశ్కుమార్కు తెలంగాణ రైతాంగం పక్షాన థ్యాంక్స్ చెబుతున్నా. 2,601 రైతు వేదికలు.. ఆరు నెలల్లో కట్టించిన గొప్పతనం మన సీఎస్కే పోతుంది. కలెక్టర్లను సావకొట్టి.. పొద్దున.. మాపు మాట్లాడి.. రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయించారు. గతంలో అయితే జాగ చూడటానికే రెండేండ్లు, మూడేండ్లు పోతుండే.. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మార్పు! పట్టుపట్టి అందరం కష్టపడుతున్నాం కాబట్టి.. ఎక్కడోళ్లం అక్కడ అనుకొన్నది అనుకున్నట్టు సాధిస్తున్నాం కాబట్టి.. ప్రగతి అని ముందుకుపోతున్నాం కాబట్టి.. ఇదంతా సాధ్యమైంది.