వరంగల్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం రూ.65.85 కోట్లతో నిర్మించిన జనగామ కొత్త సమీకృత కలెక్టరేట్ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుక్రవారం ప్రారంభించారు. కలెక్టర్ చాంబర్లో పూజలు చేసిన తర్వాత సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్కుమార్ జనగామ కలెక్టర్ శివలింగయ్యను కార్యాలయం కుర్చీలో కూర్చోబెట్టారు. కలెక్టరేట్ను నిర్మించిన బిల్డర్, ఆర్అండ్బీ ఇంజినీర్లను, నిర్మాణానికి కృషిచేసిన ప్రజాప్రతినిధులను సతరించారు. జిల్లా సమీకృత కార్యాయల భవనం పవిత్రమైన దేవాలయమని సీఎం అభివర్ణించారు. చాలా రాష్ర్టాల్లో సచివాలయం సైతం తెలంగాణలోని జిల్లా కలెక్టరేట్ల స్థాయిలో లేవని చెప్పారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు.
మధ్యాహ్న భోజనం తర్వాత టీఆర్ఎస్ జనగామ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి అభినందించారు. కార్యాలయ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ 105 మంది దివ్యాంగులకు రూ.1.05 కోట్ల విలువైన 105 ట్రై మోటార్ సైకిల్స్ను పంపిణీ చేశారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాటిని సమకూర్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును సీఎం అభినందించారు. అనంతరం జనగామ శివారు యశ్వంతాపూర్లో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను, తెలంగాణ వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తున్న తీరును వివరిస్తున్నప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. జనగామ బహిరంగసభ వేదిక, అలంకరణ, గ్రౌండ్ ఏర్పాట్లపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డిని సీఎం ప్రశంసించారు.