మాదాపూర్, డిసెంబర్ 19: వ్యవసాయం, పారిశ్రామికం సహా పలు రంగాల్లో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్.. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రశంసించారు. ప్రత్యేకించి సోలార్ ఎనర్జీతోపాటు ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) రంగాన్ని పూర్తిస్థాయిలో విస్తరించేందుకు అకుంఠిత దీక్షతో కృషిచేస్తున్నారని కొనియాడారు. టీఎస్ఈసీఏ-2021 కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆమె రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్శర్మ, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావుతో కలిసి ఉత్తమ సేవలు అందించిన 46 సంస్థలకు అవార్డులను ప్రదానం చేశారు.
రాష్ట్ర రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యాన హైటెక్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికే 9 వేల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయని, వీటి వినియోగాన్ని మరింత ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ పలు సబ్సిడీలను అందిస్తున్నారని తెలిపారు. సోలార్, ఈవీ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలను తెలంగాణ ప్రభుత్వం ఇతోధికంగా ప్రోత్సహిస్తున్నదన్నారు. రానున్న 25 ఏండ్లలో భారత్ను ఎనర్జీ ఇండిపెండెంట్ కంట్రీగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని చెప్పారు. ఈవీలు, సౌర విద్యుత్తు వ్యవస్థల వినియోగంతో డబ్బు ఆదా అవడంతోపాటు పర్యావరణానికీ ఎంతో మేలు జరుగుతుందని, దీనిపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉన్నదని సునీల్శర్మ పేర్కొన్నారు.