హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): కేంద్రానికి ధాన్యం సేకరణపై స్పష్టమైన విధానమంటూ లేదని, నిర్వహణ సామర్థ్యం లేదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రగతిని జీర్ణించుకోలేకనే అడ్డమైన రాజకీయాలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు నిలదీస్తున్నా ఎలాంటి జవాబివ్వడం లేదని విమర్శించారు. నూక తక్కువగా వస్తుందంటూ పారాబాయిల్డ్ను ప్రోత్సహించిందే ఎఫ్సీఐ అని, ఇప్పుడు అకస్మాత్తుగా గింజకూడా తీసుకోమంటే ఎలా అని ప్రశ్నించారు.
అనేక సమస్యలను అధిగమించి, విభజన చట్టాన్ని అమలు చేయడంలో కేంద్రం సరిగా సాయం చేయకపోయినా, ఏపీ సహకరించకపోయినా, కొంతమంది రాజకీయ రాక్షసులు వందల కేసులు వేసినా వాటన్నింటినీ ఎదుర్కొని ప్రాజెక్టులు పూర్తిచేసి, కరెంటు సమస్యలు పరిష్కరించడంతోనే వ్యవసాయం గణనీయంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. అన్నా రు. సోమవారం క్యాబినెట్ సమావేశానంతరం ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ రంగమే కాకుండా అన్ని రంగాలనూ అభివృద్ధి చేశామని, నీటి తీరువా లేకుండ నీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని ఉద్ఘాటించారు.
ఏడేండ్లలో సగటున 69.38 లక్షల టన్నులు
2004-14 వరకు పదేండ్లలో సగటున కేవలం 10.09 లక్షల టన్నుల ధాన్యాన్ని కేంద్రం సేకరించిందని, అదే ఏడేండ్ల కాలంలో తెలంగాణ నుంచే కేంద్రం సేకరించిన ధాన్యం సగటున 69.38 లక్షల టన్నులని సీఎం కేసీఆర్ వెల్లడించారు. గతేడాది అత్యధికంగా 1.41 కోట్ల టన్నుల ధాన్యం సేకరించిందని వివరించారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా ఇది సాధ్యమైందని, ధాన్యం ఉత్పత్తి 2015 నుంచి పెరుగుతూ వచ్చిందని చెప్పారు. గత యాసంగిలో ధాన్యం కొంటామని స్వయంగా ఎఫ్సీఐ మేనేజరే రాసి ఇచ్చారని, దాని ప్రకారమే రాష్ట్రం రైతుల నుంచి ధాన్యం సేకరించిందని, రైతులకు డబ్బులు చెల్లించిందని తెలిపారు. దాదాపు 25 లక్షల టన్నుల బియ్యం డబ్బులు రాష్ర్టానికి కేంద్రం నుంచి రావాల్సి ఉందని చెప్పారు.
ఎఫ్సీఐ మేనేజర్ రాసిన లెటర్ను సైతం కేంద్ర మంత్రికి చూపానని, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఆ అధికారిని సస్పెండ్చేస్తానని కేంద్ర మంత్రి చెప్పారని తెలిపారు. ‘నువ్వు సస్పెండ్ చేస్తవో, సస్తవో మాకు తెలియదు. మీరు రాసిచ్చిండ్రు కాబట్టే మేం బియ్యం కొన్నం. మేం ఉప్పుడు బియ్యం తీసుకోబోమని ఇప్పుడు అంటున్నరు. తీసుకోకపోతే మా పరిస్థితి ఏంది’అని నిలదీశానని చెప్పారు.‘భవిష్యత్తులో మేం పారాబాయిల్డ్ రైస్ ఇవ్వం’ అని మీరు అండర్టేకింగ్ ఇస్తేనే పోయిన యాసంగి పంట కొంటామని కేంద్రమంత్రి మెడమీద కత్తిపెట్టి రాయించుకొన్నారని సీఎం కేసీఆర్ వివరించారు. బాయిల్డ్రైస్ విషయాన్ని పక్కన పెడితే..రా రైస్ కొనుగోలుపైనైనా స్పష్టత ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరినా చెప్పడంలేదని పేర్కొన్నారు.
అర్థంకాని బ్రహ్మపదార్థమేమీ లేదు
‘యాసంగిలో తెలంగాణలో ఉండే వాతావరణ పరిస్థితులనుబట్టి కోతలు మార్చి చివరి వారం తర్వాతే వస్తాయి. కాబట్టి, కచ్చితంగా 35 డిగ్రీల ఎండ దాటుతది..అంత ఎండ ఉంటే నూక ఎక్కువే ఉంటది. అది అసలు విషయం. అందులో మరేం బ్రహ్మపదార్థం ఏమీలేదు’ అని సీఎం వివరించారు. సాధారణంగా వర్షాకాలంలో పండే ధాన్యంలో 67 కిలోల బియ్యం వస్తే.. యాసంగిలో వడ్లకి 35 కిలోలే వస్తాయని చెప్పారు.
బాయిల్డ్ మిల్లును ప్రోత్సహించిందే ఎఫ్సీఐ
యాసంగిలో వడ్లు పండిస్తే బియ్యం తక్కువ, నూక ఎక్కువ వస్తుందని..ఆ నష్టం రైతులు, మిల్లర్లు భరించలేరని సీఎం కేసీఆర్ చెప్పారు. బాయిల్డ్ చేస్తే నూక తక్కువ ఉంటుందని, ఎఫ్సీఐ వాళ్లే పార్బాయిల్డ్ టెక్నాలజీని వాడాలని మిల్లర్లను ప్రోత్సహించారని వెల్లడించారు. అప్పటి నుంచే బాయిల్డ్రైస్ మిల్లులు వచ్చాయని తెలిపారు. అప్పటినుంచి బాయిల్డ్ చేసి అమ్మడం మొదలయ్యాయని, ఇప్పుడు అకస్మాత్తుగా గింజకూడా బాయిల్డ్ రైస్ తీసుకోబోమంటున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.