CM Jagan | కడప : వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఉదయం పులివెందుల పర్యటనకు వెళ్లిన ఆయన.. బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం నేరుగా మినీ సెక్రటేరియట్లోని ఆర్వో ఆఫీసుకు వెళ్లారు. అక్కడ పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు జగన్. ఈ కార్యక్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు.
సీఎం జగన్ పర్యటన సందర్భంగా పులివెందుల జై జగన్ నినాదాలతో మార్మోగిపోయింది. స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. పులివెందుల నా ప్రాణం అంటూ భావోద్వేగంగా ప్రసంగించారు. అదే సమయంలో చంద్రబాబు అండ్ కో కుట్రలను జగన్ ఎండగట్టారు. వైఎస్సార్ కుటుంబ సభ్యులుగా చెప్పుకుంటూ రాజకీయం చేస్తున్న కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, ఆమెకు మద్దతుగా నిలిచిన వివేకా కూతురు సునీతపై జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన చిన్నాన్న వివేకాను చంపిన వాళ్లెవరో ప్రజలకు తెలుసని, అవినాష్ రెడ్డి జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. దివంగత వైఎస్సార్పై కుట్రలు చేసిన వారితో తన చెల్లెమ్మలు చేతులు కలపడం దుర్మార్గమని, ప్రజలు ఈ చెడిపోయిన రాజకీయాల్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు. కష్టకాలంలోనూ పులివెందుల తనకు అండగా నిలిచిందని, నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ కలను త్వరలోనే సాకారం చేస్తానని చెప్పారు.