ఆర్కేపురం, జనవరి 24 : సరూర్నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిఅంజన్ ఇంటిపై మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్ వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి అద్దాలతో పాటు కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. సరూర్నగర్ డివిజన్కు చెందిన బీజేపీ నాయకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్లో చేరడానికి కారణం అందెల శ్రీరాములుతో పాటు జిల్లా నాయకుల వ్యవహార శైలి అని కార్పొరేటర్ శ్రీవాణి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన అందెల శ్రీరాములు యాదవ్ అనుచరులు ఆదివారం రాత్రి కార్పొరేటర్ శ్రీవాణి ఇంటిపై దాడి చేసి ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న సరూర్నగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను పం పించారు. డివిజన్లో బీజేపీకి బలం లేకుండా చేయాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
సొంత పార్టీ నాయకులకు షోకాజ్ నోటీసులు
మన్సూరాబాద్, జనవరి 24 : సరూర్నగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిఅంజన్ ఇంటిపై దాడి చేసిన సొంత పార్టీ నాయకులపై బీజేపీ క్షమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతున్నది. ఎల్బీనగర్, మన్సూరాబాద్, చంద్రపురికాలనీలోని రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ కార్యాలయంలో సోమవారం అత్యవసరంగా అందుబాటులో ఉన్న నేతలతో రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కోర్కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కోర్ కమిటీ సమావేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండెల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కార్పొరేటర్ ఇంటిపై దాడికి పాల్పడిన ఘటనలో బీజేపీ సరూర్నగర్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధు, ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు రాములుయాదవ్, దళితమోర్చ నాయకుడు ప్రవీణ్, నాయకుడు పులిగౌడ్లపై ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదో సమాదానం చెప్పాలంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. పార్టీలో క్రమశిక్షణకు పెద్దపీట వేస్తారని.. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు.
కార్పొరేటర్ సంజాయిషీ అడగాలి
బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు అందెల శ్రీరాములపై సోషల్ మీడియలో అభ్యంతకరంగా పెట్టిన పోస్టులపై సరూర్నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, ఆమె భర్త అంజన్లను సంజాయిషీ అడగాలని నిర్ణయించినట్లు యెండెల లక్ష్మీనారాయణ తెలిపారు. కార్పొరేటర్ ఇంటిపై సొంత పార్టీ నాయకులు చేసిన దాడిపై రాష్ట్ర బీజేపీ వివరాలు అడిగిందని చెప్పారు. సంఘటనకు కారకులైన వారిపై పార్టీపరంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు పేరాల శేఖర్రావు, రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్ట ఉపేందర్ రెడ్డి, నాయకులు శ్రీధర్, గోవర్ధన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఏకంగా దాడులు చేసుకునేవరకు దిగజారారు.
ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్, నియోజకవర్గం ఇన్చార్జి మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇన్చార్జి తీరుపై విసుగెత్తుతున్న కార్యకర్తలు పక్క పార్టీలో చేరుతున్నారని కార్పొరేటర్ పెట్టిన పోస్టుకు ఇన్చార్జి అనుచరులు ఆగ్రహానికి గురయ్యారు. మహిళా కార్పొరేటర్ అని కూడా చూడకుండా.. రాత్రి సమయంలో ఆమె ఇంటిపై దాడికి దిగారు. కారు అద్దాలను ధ్వంసం చేసి రణరంగం సృష్టించారు. విషయం తెలుసుకున్న అధిష్టానం ఎవరిపై చర్యలు తీసుకోవాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నది. పార్టీ పెద్దలు ఎవరివైపు మొగ్గుచూపుతారో వేచిచూడాల్సిందే.