ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండాల గ్రామంలో బుధవారం ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరువురు ఒకరిపై ఒకరు పరస్పరం కర్రలు, గొడ్డళ్లు, రాళ్లతో దాడి చేసుకున్న సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. గ్రామంలో ఎంపీటీసీ, సర్పంచ్ మధ్య గత కొన్నేండ్లుగా పాత కక్షలతో రెండు గ్రూపులుగా విడిపోయారు. బుధవారం ఉర్సు ఉత్సవాల సందర్భంగా పోలీసుల అనుమతులు లేకుండా ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారని ఒక వర్గం వారు అభ్యంతరం తెలుపడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది.
సర్పంచ్ వర్గం వారు రాళ్లు, కర్రలు, గొడ్డళ్లతో చేసిన దాడిలో ఎంపీటీసీ వర్గానికి చెందిన అన్నదమ్ములు షేక్ జైరోద్ధీన్ (65), షేక్ హా (60) మృతి చెందారు. షేక్ సిరాజ్, షేక్ వజీమ్ల పరిస్థితి విషమంగా మారింది. వీరిని ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. గ్రామంలో జరిగిన దాడి సమాచారం తెలుసుకున్న పోలీసులు, మీడియాను అక్కడికి వెళ్లగా గ్రామంలోకి రావద్దంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ఎస్పీలు రాజేశ్ చంద్ర, ప్రవీణ్ కుమార్, ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్, ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, బోథ్, ఇచ్చోడ సీఐలు ముదావత్ నైలు, రమేశ్ బాబు, అయిదు మండలాలకు చెందిన ఎస్ఐలు, భారీ బందోబస్తుతో గుండాల గ్రామానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108లో ఆదిలాబాద్, ఇచ్చోడ ఆసుపత్రికి తరలించారు. గ్రామాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.