న్యూఢిల్లీ: చట్టసభలు తాము ఆమోదించే చట్టాలపై అధ్యయనం నిర్వహించడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. అలాగే ఆ చట్టాల ప్రభావాన్ని చట్టసభలు అంచనా వేయడం లేదని చెప్పారు. ఇది ఒక్కోసారి తీవ్ర సమస్యలకు దారితీస్తుందని, ఫలితంగా న్యాయ వ్యవస్థపై కేసుల భారాన్ని పెంచుతుందని తెలిపారు. దీనికి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టంలో తీసుకొచ్చిన 138వ సెక్షన్ను ఉదాహరణగా పేర్కొన్నారు.
ఇప్పటికే తలకుమించిన భారాన్ని మోస్తున్న మేజిస్ట్రేట్లపై ఈ సెక్షన్ వల్ల అదనంగా వేలాది కేసుల బరువు పడిందని వ్యాఖ్యానించారు. ఇది చెక్ బౌన్స్ కేసులకు సంబంధించిన సెక్షన్. ప్రత్యేక సదుపాయాలు కల్పించకుండా ప్రస్తుత కోర్టులను కమర్షియల్ కోర్టులుగా మార్చినంత మాత్రాన పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం కాదని సీజేఐ స్పష్టం చేశారు. ‘విమర్శలు, అడ్డంకులు ఎదుర్కొన్నా న్యాయం అందించే మన పని ఆగకూడదు. న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు, పౌరుల హక్కులను కాపాడేందుకు మన కర్తవ్యం కొనసాగాల’ని జడ్జిలు, న్యాయవాదులను ఉద్దేశించి జస్టిస్ రమణ చెప్పారు. రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాల ముగింపు సభలో ఆయన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో ప్రసంగించారు. దేశంలో పెండింగ్ కేసుల సమస్యను సీజేఐ ప్రస్తావిస్తూ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రెండు రోజుల పాటు జరిగిన కార్యక్రమాల్లో వచ్చిన సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
కోర్టులపై నిందలు తగవు
చట్టాలను కోర్టులు రూపొందిస్తాయని చాలామంది అనుకుంటారని సీజేఐ చెప్పారు. నిందితులను ఉదారంగా విడిచిపెట్టడానికి, వాయిదాలకు కోర్టులే కారణమన్న తప్పుడు భావన కూడా ప్రజల్లో ఉందన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అడ్వకేట్లు, కేసులో సంబంధిత పార్టీలు న్యాయ ప్రక్రియకు సహకరించాల్సి ఉంటుందని చెప్పారు. సహాయ నిరాకరణ, జాప్యం, లోపభూయిష్ట దర్యాప్తునకు కోర్టులను నిందించకూడదని హితవు పలికారు. కరోనా సమయంలో కోర్టులు ఆన్లైన్ పద్ధతిలో పనిచేయడాన్ని సీజేఐ గుర్తుచేశారు. టెక్నాలజీని ఉపయోగించుకొని కొత్త పంథాను అనుసరించడంలో ప్రపంచంలో భారత న్యాయవ్యవస్థ ముందుందని చెప్పారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం రూ.9 వేల కోట్లు కేటాయించిందన్న మంత్రి రిజుజు ప్రకటనపై సీజేఐ హర్షం వ్యక్తం చేశారు. అయితే కొన్ని రాష్ర్టాలు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం లేదని చెప్పారు. మరోవైపు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ పార్లమెంటు, అసెంబ్లీలు చేసిన చట్టాలను, కోర్టులు ఇచ్చిన తీర్పులను అమలు చేయని పరిస్థితిలో ఎవరూ ఉండకూడదని అన్నారు.
కోర్టులపైనే ప్రజల నమ్మకం: కోవింద్
ప్రజల దృష్టిలో న్యాయవ్యవస్థే అత్యంత నమ్మకమైనదని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై చర్చకు తావులేదని చెప్పారు. భవిష్యత్తు తరాలకు ప్రామాణికమైన తీర్పులు వెలువరించిన చరిత్ర భారత న్యాయ వ్యవస్థకు ఉందన్నారు. కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ సమయంలో విచక్షణతో ఆచితూచి మాట్లాడటం జడ్జిల విధి అని, అనాలోచిత వ్యాఖ్యలు సందేహాలకు తావిస్తాయని హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలు మంచి ఉద్దేశంతో చేసినప్పటికీ కోర్టులను విమర్శలపాలు చేస్తాయని చెప్పారు.