న్యూఢిల్లీ, నవంబర్ 28: డయాబెటిస్ను ఒక ‘నిశ్శబ్ద మహమ్మారి’గా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అభివర్ణించారు. ‘డయాబెటిస్ వల్ల కలుగుతున్న మానవ నష్టం మాటల్లో చెప్పలేనిది. దేశంపై పడుతున్న ఆర్థిక భారం అంచనాలకు అందనిద’ని చెప్పారు. ఈ వ్యాధితో బాధపడేవారికి చికిత్స అందించడం కోసం ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని సూచించారు. మధుమేహానికి చికిత్స చాలా ఖర్చుతో కూడుకొన్నదని, ఇది పేదల పాలిట శత్రువుగా మారిందని చెప్పారు. డయాబెటిస్పై అవగాహనకు సంబంధించిన ఓ కార్యక్రమంలో జస్టిస్ రమణ ఆదివారం పాల్గొని మాట్లాడారు.
డయాబెటిస్ ఎంత ప్రమాదకారో కొవిడ్ నిరూపించిందన్నారు. వైరస్తో డయాబెటిక్ రోగులకు ఎక్కువ ప్రాణహాని ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. కొవిడ్ ఒక వేవ్లాగా వస్తే డయాబెటిస్ మాత్రం దశాబ్దాలుగా విస్తరిస్తూ ప్రాణాలను కబలిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. డయాబెటిస్ను శాశ్వతంగా దూరం చేయడానికి ఔషధాన్ని వీలైనంత వేగంగా కనుక్కోవాలని, త్వరలోనే ఔషధం అందుబాటులోకి వస్తుందని ఆకాంక్షించారు. వైద్యులు, శాస్త్రవేత్తలు దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని కోరారు.
గ్రామాల్లోనూ చాలామందికి
డయాబెటిస్ అనేది ఆధునిక జీవన విధానం సృష్టించిన ఉత్పత్తే అని జస్టిస్ రమణ అన్నారు. ‘మధుమేహం ధనవంతులకు మాత్రమే వచ్చే జబ్బు అని అపోహ ఉండేది. రెండు దశాబ్దాలుగా ఇది క్రమంగా మారుతున్నది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలామందిలో ఇది కనిపిస్తున్నద’న్నారు. డయాబెటిస్ను ‘అవకాశవాద హంతకురాల’ని వైద్యులు, పరిశోధకులు సరిగ్గా చెప్పారన్నారు.
మన ప్రమాణాలను రూపొందించుకోవాలి
డయాబెటిస్పై భారత్ కేంద్రంగా అధ్యయనాలు రావాల్సి ఉందని జస్టిస్ రమణ ఈ సందర్భంగా అన్నారు. ఇండియాలో డయాబెటిస్పై చాలా సమాచారం ఉన్నా వాటిల్లో ఎక్కువగా పశ్చిమ దేశాల అధ్యయనాలే ఉన్నాయని పేర్కొన్నారు. ‘దురదృష్టవశాత్తూ.. మనం ఇప్పటికీ శరీరంలో షుగర్ ఏ స్థాయిలో ఉండాలనే ప్రమాణాలను రూపొందించుకోలేకపోతున్నాం. వేర్వేరు దేశాల్లో వేర్వేరు స్థాయులను ప్రమాణాలుగా తీసుకొంటున్నారు. మన దేశంలో నిర్ణీత ప్రమాణాలను ఇప్పటికైనా రూపొందించుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉన్నాయ’న్నారు.