న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 : నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అంశంపై పాఠ్యాంశాలను చేర్చడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. న్యాయవ్యవస్థకు సమగ్రతకు కళంకం, అపకీర్తి తేవడానికి ఎవరినీ అనుమతించబోమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థను కించపరిచేలా ఉన్న ఈ చాప్టర్ విషయాన్ని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ తదితరులు ప్రస్తావించి, ఈ విషయాన్ని అత్యవసరంగా పరిశీలించాలని చేసిన విజ్ఞప్తి మేరకు సీజేఐతో పాటు న్యాయమూర్తులు జోయ్మాల్య బాగ్చీ, విపుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం కేసును సుమోటోగా స్వీకరించింది. ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లో న్యాయవ్యవస్థ గురించిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను న్యాయవాదులు ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సోషల్ సైన్స్ కొత్త పాఠ్య పుస్తకాలలో ‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ పేరుతో ఒక చాప్టర్ను పెట్టారు. న్యాయమూర్తులు కేవలం కోర్టులో వారి ప్రవర్తనకు మాత్రమే కాకుండా కోర్టు వెలుపల వారు ఎలా ప్రవర్తిస్తారో కూడా నియంత్రించే ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉంటారని అందులో పేర్కొన్నారు. ‘ఈ వ్యవస్థలో సభ్యులుగా ఉన్న మేము 8వ తరగతి విద్యార్థులకు ఇలా న్యాయ వ్యవస్థలో అవినీతి గురించి చెప్పడం మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఈ అధ్యాయం మా వ్యవస్థకు పూర్తిగా అపకీర్తిని ఆపాదించేలా ఉంది’ అంటూ కపిల్ సిబల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఈఆర్టీ ఎంపిక చేసిన విధానాన్ని సింఘ్వీ విమర్శించారు. ‘వారు దేశంలో మరెక్కడా అవినీతి లేదని భావించారు. బ్యూరోక్రసీ, రాజకీయాలు, ప్రజా జీవితం, ఇతర సంస్థల్లో అవినీతి గురించి ఒక్క మాట కూడా లేదు’ అని అన్నారు.
సిబల్ ప్రస్తావించిన అంశంపై తనకు పూర్తి అవగాహన ఉందని, దీనిపై ఇప్పటికే పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, ఇతరుల నుంచి తనకు ఫోన్కాల్స్, మెసేజ్లు రావడం కలవరపెట్టిందని సీజేఐ సూర్యకాంత్ అన్నారు. దీనిని సుమోటోగా స్వీకరించాలని కపిల్ విజ్ఞప్తి చేయగా, ‘దీనిపై నాకు పూర్తి అవగాహన ఉంది. మొత్తం న్యాయవ్యవస్థకు సంబంధించిన అంశం ఇది. ఉద్దేశపూర్వక చర్యగా ఇది కనిపిస్తున్నది. ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నవారైనా, న్యాయవ్యవస్థను అప్రతిష్ఠపాలు చేసేందుకు నేను అనుమతించబోను. స్వయంగా నేనే ఈ అంశాన్ని పరిశీలిస్తాను’ అని సీజేఐ పేర్కొన్నారు. దీనిని ఎలా డీల్ చేయాలో తనకు తెలుసునని అన్నారు. ఈ విషయాన్ని లేవనెత్తిన న్యాయవాదులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పాఠ్య పుస్తకంలోని ఒక చాప్టర్పై వివాదం వచ్చిన క్రమంలో ఎన్సీఈఆర్టీ బుధవారం నుంచి 8వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకం అమ్మకాలను నిలిపివేసింది. ‘న్యాయ వ్యవస్థలోని వివిధ స్థాయిల్లో అవినీతిని ప్రజలు చవిచూస్తున్నారు. పేదలు, వెనుకబడిన వారికి ఇది న్యాయం పొందడంలో సమస్య మరింత తీవ్రతరం చేస్తుంది. అందువల్ల కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో విశ్వాసాన్ని పెంపొందించడానికి, పొందడానికి నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని ఆ చాప్టర్లో పేర్కొన్నారు.