చంపాపేట: ఆస్తిపన్ను వసూళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్న ప్రాపర్టీ ట్యాక్స్ బిల్ కలెక్టర్ సాయికిరణ్ యాదవ్ను ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ సస్పెండ్ చేసినట్లు ఎల్బీనగర్ సర్కిల్ ఇన్చార్జీ డిప్యూటీ కమీషనర్ బోనగిరి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ చంపాపేట డివిజన్ పరిధిలోని ఆస్తిపన్ను వసూళ్ల విషయంలో ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని పలు కాలనీల ఇంటి యజమానుల ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించే ఇంటి యజమానులకు నోటీసులు సకాలంలో అందజేయకపోవడం, పన్నులు వసూలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బిల్ కలెక్టర్ సాయికిరణ్ యాదవ్ను విధుల నుంచి తొలగించినట్లు డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ తెలిపారు. అలాగే మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్కు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు, జాయింట్ కమిషనర్ కృష్ణకుమారిని సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.