జమ్మూ: భారత ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ డీవై చంద్రచూడ్(CJI D Y Chandrachud) ఇవాళ మాతా వైష్ణోదేవిని దర్శించుకున్నారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన వైష్ణోదేవిని దర్శించుకోవడం ఇదే తొలిసారి. ఆలయ సీఈవో అన్షుల్ గార్గ్ ఆయనకు స్వాగతం పలికారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలో వైష్ణోదేవి ఆలయ బోర్డు చేపడుతున్న అభివృద్ధి పనులను సీజేఐకి ఆయన వివరించారు.
పెరుగుతున్న భక్తులకు సమానంగా సదుపాయాల్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ సీఈవో తెలిపారు. వైష్ణోదేవి బోర్డు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను సీజేఐ ప్రశంసించారు. తన పర్యటనలో భాగంగా ఆయన భైరవ్ ఘాటీని కూడా సందర్శించారు. నిన్న ఆయన జమ్మూలో కొత్త హైకోర్టు బిల్డింగ్ కోసం శంకుస్థాపన చేశారు.