మక్తల్, జూలై 06: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గురువారం తన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ జీవితాంతం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. తెలంగాణ ప్రజల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించడంలో, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సిద్ధాంతపరమైన బలాన్ని అందించడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.