వసతి దశన శిఖరే ధరణీ తవ లగ్నా
శశిని కళంక కలేవ నిమగ్నా
కేశవ! ధృత సూకరరూప జయ జగదీశ! హరే!
‘సూకర రూపాన్ని ధరించిన ఓ కేశవా! ఓ జగదీశా! ఓ శ్రీహరీ! నీకు జయము జయము. గర్భోదక సముద్రంలో మునిగి, విశ్వపు అడుగు భాగానికి చేరిన ధరణి, చంద్రుడిపై మచ్చ వలె నీ కొమ్ముదంతం అంచున ఇమిడి ఉన్నది’ అని వైష్ణవ వాగ్గేయకారులలో ప్రముఖుడైన శ్రీ జయదేవ గోస్వామి దశావతార స్తోత్రంలో వరాహ అవతారాన్ని ఈ విధంగా కీర్తించారు.
దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు మత్స్య, కూర్మ, వరాహ వంటి రూపాలను ఎందుకు ధరిస్తాడన్నది చాలామందికి అర్థం కాని విషయం. ఇవన్నీ కేవలం కల్పిత కట్టుకథలని కొందరి భావన. అయితే, శ్రీమద్భాగవతం గాని, సుప్రసిద్ధ ప్రామాణిక ఆచార్యులు గాని వీటిని ఎన్నడూ కల్పితాలుగా వ్యాఖ్యానించలేదు. ఇదే విషయాన్ని హరేకృష్ణ ఉద్యమ సంస్థాపక ఆచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారిని ఎవరో ప్రశ్నించినపుడు ఇలా సమాధానమిచ్చారు.. ‘శ్రీకృష్ణుడు ఒక వరాహంగా అవతరించినంత మాత్రాన వారూ బాధలను అనుభవించినట్టు కాదు. సర్వం ‘ఆనంద చిన్మయ రస ప్రతిభావితాభిః’ (భక్తి రసామృత సింధు 5.37)’ అని పేర్కొన్నారు.
దేవదేవుడు సూకర రూపాన్ని ధరించడం ఎందుకు? అనుకోవచ్చు. లోకాన్ని రక్షించడానికి సందర్భోచితంగా అవతరించాడు భగవానుడు. అది కేవలం తాత్కాలికం. ఉదాహరణకు ఒక చక్రవర్తి మనవడితో ఆడుకుంటున్నాడు. రాజ్య పరివారానికి ఆయన చక్రవర్తే. కానీ, ఆ మనవడికి మాత్రం తాతయ్య! చిన్నపిల్లాడు ఏం కోరితే అది చేస్తున్నాడు. తను గుర్రం స్వారీ చేయాలని కోరాడు మనవడు. వెంటనే చక్రవర్తి వంగి ఆ చిన్నారిని వీపు మీద ఎక్కించుకొని గదంతా తిరిగాడు. అంతమాత్రాన చక్రవర్తి గుర్రం అయిపోయినట్టు కాదు కదా! అదేవిధంగా, కేశవ ధృత సూకర రూప అంటే, అది సాధారణ వరాహం వంటి రూపం కాదు. కేవలం దైవలీల. శిష్ట రక్షణ కోసం, దుష్ట సంహారం కోసం స్వామి అనుగ్రహించిన రూపం వరాహం.
వరాహ అవతార వృత్తాంతాన్ని ప్రభుపాదుల వారు వివరిస్తూ.. ‘సృష్టి ఆరంభం నుంచి దేవతలు, దైత్యులనే ఇరువర్గాలు విశ్వంలోని లోకాలన్నిటినీ శాసించేవారు. ఈ విశ్వంలోని దేవతల్లో బ్రహ్మ ప్రథముడు. దైత్యుల్లో హిరణ్యాక్షుడు ప్రథముడు. భగవంతుడు ఏర్పర్చిన సృష్టిలో కొన్ని నిర్దిష్ట నియమాల అనుసారమే వివిధ లోకాల్లోని గ్రహాలన్నీ గాలిలో తేలియాడే బంతుల్లా అంతరిక్షంలో పరిభ్రమిస్తున్నాయి. వాటి అంతర్ నిర్మాణమే అందుకు కారణం. విశ్వంలోని సగభాగం గర్భోదక జలములతో నిండి ఉండగా, మిగతా సగభాగం అసంఖ్యాకమైన గ్రహాలతో కూడి ఉంది. ఈ లోకాలన్నీ తమ తమ కక్ష్యలలో భ్రమించడం కోసం నిర్దేశించిన నియమాలకు భంగం వాటిల్లినప్పుడు విశ్వంలోని గర్భోదక జలంలో అవి పతనమయ్యే ప్రమాదం ఉంది. పూర్వం హిరణ్యాక్షుడనే అసురుడు ఈ గ్రహాల కక్ష్యా క్రమానికి విఘాతం కలిగించడంతో భూమి తన భారస్థితిని కోల్పోయి గర్భోదక జలాల్లో పతనమైంది.
ఆ సమయంలో ఈ జగత్తు స్థితికారుడైన భగవంతుడు భీకరమైన సూకర రూపాన్ని ధరించి తన కొమ్ము దంతాలతో గర్భోదక జలాల నుంచి భూమండలాన్ని పైకెత్తి నిలబెట్టాడు. ఆ సందర్భంలో వరాహస్వామిని అడ్డగించబోయిన హిరణ్యాక్షుడిని స్వామి తన కొమ్ము దంతాలతో గుచ్చి సంహరించాడు’ అన్నారు.
భగవంతుడి అవతారాల వైశిష్ట్యం ఇదే. లోకానికి కీడు ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో భగవంతుడు అవతరిస్తాడు. మనుషుల చింతనకు అందని పరమాద్భుత రీతిలో తన లీలలను ప్రదర్శిస్తాడు. శ్రీకృష్ణుడు స్వయంగా ఒనర్చిన ఈ లీలలను మళ్లీ మళ్లీ వినడం ద్వారానే జీవిత పరమార్థాన్ని సాధించగలం. శ్రీ వరాహ స్వామికి జయము జయము! లోక సంరక్షకుడైన శ్రీహరికి జయము జయము!! హరేకృష్ణ!
రేపు వరాహ ద్వాదశి
శ్రీమాన్
సత్యగౌర చంద్రదాస ప్రభూజి
93969 56984