‘సులభుడై ఉన్నాడు సుగ్రీవ నారసింహుడు’ అని అన్నమయ్య నరసింహస్వామి ని భక్తులకు సులభుడిగా కీర్తించాడు. హనుమంతుడు కూడా తనను నమ్మిన వారికి సులభుడే. ఎంతటి కష్టంలోంచైనా గట్టెక్కిస్తాడు. దానికి ఉదాహరణలు సుగ్రీవ, విభీషణ పట్టాభిషేక ఘట్టాలు. ఒక కథ ప్రకారం.. వాలి, సుగ్రీవులు, అంజన ముగ్గురూ అహల్య సంతానం. ఆ రకంగా అంజనీసుతుడైన హనుమం తుడికి వాలి సుగ్రీవులు మేనమామలు అవుతారు. తన గురువు సూర్యుడి కోరిక మేరకు హనుమంతుడు ఎల్లప్పుడూ సుగ్రీవుణ్ని అంటిపెట్టుకుని ఉంటాడు. అలా ఆయనను ‘సుగ్రీవ హనుమంతుడు’ అనుకోవచ్చు.
వాలి ఓసారి మాయావి అనే రాక్షసుడితో పోరాడాల్సి వస్తుంది. పోరులో భాగంగా ఇద్దరూ ఓ గుహలోకి చొరబడతారు. వాలి గుహకు ఓ రాయి అడ్డుగా ఉంచుతాడు. యుద్ధంలో మాయావి మరణిస్తాడు. రక్తం ఏరులై పారుతుంది. గుహ నుంచి వాలి ఎంతకూ బయటికి రాడు. మరణించింది సోదరుడే అని సుగ్రీవుడు భావిస్తాడు. కిష్కింధకు వచ్చి వానర రాజుగా పట్టాభిషేకం చేయించుకుంటాడు. ఇంతలో తిరిగి వచ్చిన వాలి, తమ్ముడు సింహాసనం ఆక్రమించుకున్నాడని పొరపడతాడు. అతణ్ని చంపబోతాడు. అక్కడినుంచి పారిపోయిన సుగ్రీవుడు తన అన్న అడుగుపెట్టలేని రుష్యమూక పర్వతానికి చేరుకుంటాడు.
వాలి ఓ సందర్భంలో దుందుభి అనే రాక్షసుడితో తలపడతాడు. అతణ్ని సంహరిస్తాడు. అతని దేహాన్ని దూరంగా విసురుతాడు. అది మతంగ ముని తపస్సు చేసుకుంటున్న రుష్యమూకం మీద పడుతుంది. దాంతో ఆ పర్వతం మీద అడుగుపెడితే తల పగిలి మరణిస్తాడని మతంగుడు వాలిని శపిస్తాడు. సుగ్రీవుడు రుష్యమూకానికి చేరుకున్న కారణం ఇదే. అతని వెన్నంటే ఉంటారు హనుమంతుడు, మరికొంతమంది వానరులు. అయినప్పటికీ వాలి కుదిరినప్పు డల్లా సుగ్రీవుణ్ని రుష్యమూకంపై అడుగుపెట్టకుండానే హింసిస్తుండే వాడు. ఓ సారి మారుతి గాలిలో ఎగురుతున్న వాలిని పట్టి కిందికి లాగే ప్రయత్నం చేస్తాడు. తనకు ప్రాణగండం ఉండటంతో ఇకనుంచి సుగ్రీవుణ్ని హింసించనని వాలి మాట ఇస్తాడు. దాంతో హనుమ అతణ్ని వదిలిపెడతాడు.
సీతాన్వేషణలో భాగంగా సుగ్రీవుడి సాయం కోరి రామలక్ష్మణులు కిష్కింధకు వస్తారు. వారిని తన అన్న పంపించాడేమోనని భయపడతాడు సుగ్రీవుడు. అప్పుడు హనుమంతుడు రామలక్ష్మణుల రాక కారణాన్ని తెలుసుకుంటాడు. సుగ్రీవుడితో శ్రీరాముడికి మైత్రి నెలకొల్పుతాడు. సీత జాడ కనిపెట్టడానికి హామీ ఇప్పిస్తాడు. బదులుగా సుగ్రీవుడిని వానర రాజ్యానికి రాజును చేస్తానం టాడు రాముడు. అలా వాలిని తనతో యుద్ధానికి ఆహ్వానిస్తాడు సుగ్రీవుడు. యుద్ధం చేస్తున్న క్రమంలో రామబాణం వాలి గుండెల్ని చీలుస్తుంది. సుగ్రీవుడికి వానర రాజ్యం దక్కుతుంది. తన భార్య రుమను తిరిగి పొందడమే కాకుండా, అన్న భార్య తారనూ పెండ్లి చేసుకుంటాడు. సుగ్రీవుడు శ్రీరాముణ్ని కలవడం, ఆ స్నేహం కారణంగా రాజు కావడానికి కారణం హనుమంతుడే. దీనినే తులసీదాసు ‘తుమ ఉపకార సుగ్రీవహి కీన్హ/రామ మిలాయ రాజపద దీన్హా’ అని హనుమాన్ చాలీసాలో పేర్కొన్నాడు.
సుగ్రీవుడే కాదు, విభీషణుడు లంకకు అధిపతి అయ్యేందుకూ హనుమంతుడే కారణం. తులసీదాసు రచించిన ‘రామచరిత మానస్’ ప్రకారం.. సీతాన్వేషణలో భాగంగా లంకకు చేరుకున్న సందర్భంలోనే హనుమంతుడు విభీషణుడిని చూస్తాడు. సీతను వెతుకుతుంటే రాత్రివేళ ఓ ఇంట్లోంచి ‘రామనామ’ స్మరణ వినిపిస్తుంది. ఎవరా అని చూస్తే అతను రావణుడి తమ్ముడు విభీషణుడు. సీతను వదిలిపెట్టమని హితవు చెప్పడంతో రావణుడు తమ్ముణ్ని తరిమేస్తాడు. అప్పుడు విభీషణుడు రాముడి శరణు కోరివస్తాడు. వానరులంతా శత్రువు సోదరుడు కాబట్టి విభీషణుడిని నమ్మవద్దని రాముడికి సలహా ఇస్తారు. హనుమ మాత్రమే ఆశ్రయం ఇవ్వొచ్చని అంటాడు. చివరికి రావణ సంహారం జరుగుతుంది. విభీషణుడికి లంకా రాజ్య పట్టం దొరుకుతుం ది. హనుమాన్ చాలీసాలో ఈ వృత్తాంతాన్ని ‘తుమరో మంత్ర విభీషణ మానా/ లంకేశ్వర భయ సబజగ జానా’ అని తులసీదాసు అక్షరీకరించాడు. నీ సలహాను అనుసరించిన విభీషణుడు లంకేశ్వరుడు అయ్యాడు. ఆ విషయం ప్రపంచం అంతటికీ తెలుసు అని దీని భావం. అలా హనుమంతుణ్ని చిత్తశుద్ధితో నమ్మినవారికి మంచిపనులలో లాభం కలుగుతుందని సుగ్రీవుడు, విభీషణుడి వృత్తాంతాలు వివరిస్తాయి. మారుతి సిద్ధుడే కాదు కార్యసిద్ధుడు కూడా!
చింతలపల్లి
హర్షవర్ధన్