తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా
నవాత్మానం మన్యే నవరసమహాతాండవనటమ్
ఉభాభ్యామేతాభ్యా ముదయవిధి ముద్దిశ్య దయయా
సనాథాభ్యాం జజ్ఞే జనకజననీమజ్జగ దిదమ్!
(సౌందర్యలహరి-41)
మహా సంపూర్ణ దివ్య శక్తి లలితాదేవి. అలాగే మహా సంపూర్ణ శోభన చైతన్యం కామేశ్వరుడు. లలితాదేవి లాస్యం చేస్తున్నది, కామేశ్వరుడు తాండవం చేస్తున్నాడు. ఒకరిది సుకుమారం, మరొకరిది భయంకరం. ఒకరు వాక్కు, మరొకరు అర్థం. వాగర్థములు రెండూ పరస్పరాధారితాలు. వీరిరువురే జగత్తుకు తల్లిదండ్రులు. అందుకే జనక జననీం అన్నారు ఆదిశంకరులు.
అమ్మా! నీవు ఆనంద భైరవివి. మూలాధార చక్రంలో సమయ అనే నీదైన కళతో కూడి నవరస తాండవమాడే పరమశివుడే ఆనందభైరవుడు. ఆధారచక్రంలో జగదుత్పత్తి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్న మీకు నమస్సులు. మూలాధార చక్రం పృథ్వీతత్వం. ఇదే అన్నిటికీ మూలం, ఆధారం. ఇక్కడ సృజన సమయంలో లాస్యం చేసేది అమ్మ, ప్రళయకాలంలో తాండవమాడేవాడు పరమశివుడు. సృజన లయలు రెండూ ఒకదానివెంట మరొకటి నడుస్తుంటాయి. ఆధారచక్రం త్రికోణాకృతిలో బిందువుగా ఉంటుంది. శ్రీ చక్రంలో మధ్యలో ఉన్నది సర్వానందమయమైన బిందువు. దాన్ని ఆవరించి ఉండేది త్రికోణం. ఇక్కడ సర్పాకృతిలో సుప్తావస్థలో ఉండేది కుండలినీ శక్తి. దీన్ని మూలాధారం నుంచి స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రం మీదుగా సహస్రారానికి చేర్చడమే సాధన పరమ లక్ష్యం.
ఐదో నెలలో గర్భస్థ శిశువుకు వెన్నెముక ఏర్పడుతుందనీ, దాని ఆధారంగా చక్రాలు ఏర్పడి పంచేంద్రియ స్ఫూర్తి కలుగుతుందని సంతానోపనిషత్తు చెప్తుంది. కులామృతైకరసికా (కుల అనే కుండలినీ క్షేత్రంలో ప్రవహించు అమృత రసమూర్తి), కులసంకేతపాలినీ (కుల కుండలినీ రహస్యాలను కాపాడి పాలించే తల్లి), కులాంగనా (జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం, లేదా ద్రష్ట దర్శనం, దృశ్యం అనే త్రిపుటి), కులాంతస్థా (కులం, కుండలినీ యందు అంతర్భాగమై ఉండునది), కౌళినీ (కులం నుంచి ఉద్భవించునది), కులయోగినీ (కుండలినీ యోగ స్వరూపమైన మహాయోగిని) అని లలితా సహస్ర నామాలు కుండలినీ శక్తి గురించి చెప్తున్నాయి. ఈ భావనను చిత్తంలో నిలిపి సాధకులు ఆ భావనలో తాదాత్మ్యం చెందడం ద్వారా ఫలితాన్ని త్వరగా పొందుతారని చెప్తూ న్యాసం చెప్పుకొనే సమయంలో ఆ దేవతను శరీరంపై ఆవాహన చేసుకుంటారు.
షట్చక్రాలకు పైన బ్రహ్మరంధ్రం వద్ద ఉండేది సహస్రారం. ఇది వేయి దళాలతో ప్రకాశిస్తుంటుందని చెప్తారు. సహస్ర దళ పద్మస్థా (బ్రహ్మరంధ్రం పైన చైతన్య చక్రంలో సహస్రదళ పద్మంలో ఉండే చిద్రూపి- లలిత), సర్వవర్ణోప శోభితా (అన్ని రంగులతో శోభిల్లు తల్లి), సర్వాయుధధరా (అన్ని ఆయుధాలను ధరించినది), శుక్ల సంస్థితా (జగదుత్పత్తి కారణమైన శుక్ల వీర్యాల్లో స్థితమైన దేవి), సర్వతోముఖీ (అన్ని దిశలలో ముఖాలు ఉండే తల్లి- అంటే అన్నింటినీ గమనించగలిగినది), సర్వౌదన ప్రీతచిత్తా (అన్ని ఆహారాలూ ప్రియమైన తల్లి), యాకిన్యాంబ స్వరూపిణీ (యాకినీశక్తి రూపిణి లలిత) అని లలితా సహస్ర నామాలు సహస్రదళ పద్మాన్ని వివరిస్తున్నాయి.
అమ్మను మానసికంగా భావన చేసి ఆహ్వానించి, అర్ఘ్యపాద్యాదులిచ్చి, షోడశోపచార పూజలు చేయడం, ధూపదీప నైవేద్యాలు, హస్తప్రక్షాళనాదులు సమర్పించడం, శుద్ధ స్ఫటికాలతో (16 కళలతో) పూజించడం, నీరాజనాదులతో సంతోషింపజేయడం సమయాచారంలో పూజావిధిగా చెప్తారు. దానితో సాధకునికి సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యాలు లభిస్తాయని, చివరగా జన్మరాహిత్యం అమ్మ ఉపాసనకు ఫలితంగా చెప్తారు. అయితే ఈ మంత్రోపదేశం, షట్చక్ర పూజా విధానాలను గురుముఖతః స్వీకరించాలి. ఆ సంప్రదాయాన్ని అనుసరించి అనుష్ఠించాలి. గురువుపై అపార విశ్వాసం, మంత్రశక్తిపై అచంచలమైన నమ్మకమే సాధకుడిని లక్ష్యానికి చేరుస్తుంది.
పాలకుర్తి రామమూర్తి