సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే
మణిద్వీపే నీపోప వనవతి చింతామణిగృహే
శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయామ్
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్
(సౌందర్య లహరి-8)
అమ్మా! అమృత సముద్రం మధ్యలో, కల్పవృక్ష వాటికలో, మణిద్వీపంలో, కదంబ వనంలో, చింతామణి గృహంలో పరమశివుడి పర్యంకంపై చిద్విలాస మూర్తివై కూర్చున్న నీవు జ్ఞానానందలహరివి. హే చిదానందలహరీ! ఏ కొందరో (కతిచన) ధన్యాత్ములు మాత్రమే నిన్ను సేవించి తరించగలుగుతు న్నారు.
సుధ అంటే పాలు కూడా. సుధాసింధు అంటే పాల సముద్రం అని కూడా చెప్పుకోవచ్చు. ‘ఘృతేన వర్ధతే బుద్ధి, క్షీరేణ వర్ధతే ఆయుః’ నెయ్యి వల్ల బుద్ధి పెరుగుతుంది. పాల వల్ల ఆయుష్షు పెరుగుతుంది. అందుకే పాలు అమృతంతో సమానమని చెబుతారు. అమ్మ ‘సుమేరు శృంగ మధ్యస్థా’ మేరు పర్వతంలో మూడుశిఖరాల మధ్య ఉన్న నాలుగో శిఖరాన విలసిల్లు దేవి. ‘శ్రీమన్నగరనాయికా’ ఏడు ప్రాకారాలు, ఏడు వాటికలు, స్వర్ణరత్నమయ భవనాలు, వాపీత్రయం కలిగిన శ్రీనగరం అనే పట్టణంలో చిద్రూపియై ప్రకాశిస్తుంది లలితాదేవి. అక్కడ మందారం, హరిచందనం, పారిజాతం, కల్పవృక్షాలుగా పిలిచే దేవతావృక్షాలు ఉన్నాయి. కడిమి చెట్ల వనమూ ఉంటుంది.
మానవ శరీరంలో సహస్రదళ పద్మమే మేరు పర్వతం. సాధకుడు ఆజ్ఞాచక్రాన్ని దాటిన తర్వాత చేరే సహస్రారంలో (సహస్రదళ పద్మంలో) అమృత సింధువు, అక్కడే వృద్ధిక్షయాలు లేని పూర్ణ చంద్రుడు ఉంటాడు. ఆ చంద్ర కిరణాలు అమృతమయమైనవి. అలాంటి అమృత సముద్రంలో మణిద్వీపం ఉన్నది. అమృతం అంటే శాశ్వతమైన ఆనందధార. మణి అంటే స్వయం ప్రకాశం కలిగినది.. ఇతరాలను ప్రకాశింప చేయగలిగినది. ‘నతత్రో సూర్యోభాతి, నచంద్ర తారకం’ అక్కడ సూర్య చంద్రులు తారకల ప్రకాశం నిలవదు. ఆ మణిద్వీపానికి 25 ప్రాకారాలు, 24 ఆవరణలు ఉన్నాయి. రెండు ప్రాకారాల మధ్య స్థలాన్ని ఆవరణ అంటారు.
ఆ 24వ ఆవరణలోనే చింతామణి గృహం ఉన్నది. దేనికీ కొదువలేని చింతామణులతో నిర్మితమైన గృహంలో; ‘శివాకారే మంచే’ అంటే త్రికోణాకారమైన మంచంపై ‘పరమశివ పర్యంక నిలయాం’ పరమ శివుడి పర్యంకంపై ఆ పరమేశ్వరి ఆసీనురాలై ఉంటుంది. ఆమె ‘పంచప్రేతాసనాసీనా’. త్రిమూర్తులు, ఈశ్వరుడు మంచానికి నాలుగు కోళ్ళు కాగా, దానిపై పరచే బల్ల సదాశివుడు అంటుంది.. దేవీభాగవతం.
అమ్మ ‘పంచబ్రహ్మాసనస్థితా’. మామూలుగా ఆసనానికి నాలుగు కోళ్ళు ఉంటాయి. కానీ, సింహాసనానికి అయిదు కోళ్ళుంటాయి. త్రిమూర్తులు, ఈశ్వరుడు, సదాశివుడు ఈ అయిదుగురూ పరమేశ్వరి సింహాసనానికి కోళ్ళుగా ఉంటారు. ఆ అమ్మే ‘పంచకోశాంతరస్థితా’. అన్నమయ కోశం (స్థూల దేహం), ప్రాణమయ, మనోమయ కోశాలు (సూక్ష్మ దేహం), విజ్ఞానమయ కోశం (కారణ దేహం), ఆనందమయ కోశం (తురీయం) ఇవే పంచకోశాలు. ఉన్నది నిరాకారమైన శక్తి ఒక్కటే. సృష్టి చేయాలనే సంకల్పంతో తనను రెండుగా విభజించుకున్నది. ఆ ద్వంద్వాన్నే ప్రకృతి పురుషులు, శివకామేశ్వరులుగా చెప్పుకొంటున్నాం. ఆమె చిదానందలహరి. చిత్ చైతన్యం అంటే నిరతిశయ ఆనందం.. లహరి.. ప్రవాహం. ‘సకల జీవుల్లో ‘అహం’ రూపంలో నా తత్వం వ్యాపకమై ఉన్నది’ అని లలితాపరమేశ్వరి దేవీభాగవతంలో చెబుతుంది.
అమ్మ ఆరాధన రెండు విధాలు. ఒకటి బాహిరమైన అర్చన. దీనినే కౌళాచార మని చెబుతారు. రెండోది అంతర్ముఖమైనది. దీనిని సమయాచారం అంటారు. ‘అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా’ అంటుంది లలితా సహస్ర నామం. అంతర్ముఖులైన వారికి మాత్రమే ఆమె పాదాలచెంత స్థానం లభిస్తుందని బాహ్యంగా ఆమెను సాధించడం కష్టసాధ్యమని చెబుతారు. ‘క్వణత్కాంచీదామా..’ అంటూ చెప్పిన శ్లోకం అమ్మవారి సగుణరూపాన్ని ప్రకటిస్తే.. ‘చిదానందలహరీ’ అంటూ ఈ శ్లోకం అమ్మవారి నిర్గుణరూపాన్ని చెబుతుంది. సగుణరూపాన్ని ఆరాధిస్తూ క్రమంగా అమ్మ నిర్గుణ రూపంలో లయం కావడం సాధకుని అంతిమ లక్ష్యం.