అనగనగా ఒక గ్రామంలో నాని అనే కుర్రవాడు ఉండేవాడు. ప్రతిరోజూ వాళ్ల నాయనమ్మ చెప్పే నీతికథలు వినేవాడు. ధర్మం, అధర్మం, స్వర్గం, నరకం ఇలా అనేక ధార్మిక విషయాలు నానమ్మ చెప్పిన కథల ద్వారా తెలుసుకునేవాడు. స్వర్గలోకం ఎలా ఉంటుందో కూడా వర్ణించి చెప్పింది నానికి వాళ్ల నానమ్మ. అప్పటినుంచి నానికి ఎప్పుడూ స్వర్గలోక సౌందర్యం చూడాలనే కోరిక పెరిగిపోయింది.
ఒకరోజు ఓ సాధువు ఆ ఊరికి వచ్చాడు. నాని సాధువు దగ్గరికి వెళ్లి స్వర్గం చూడాలన్న కోరిక వ్యక్తం చేశాడు. స్వర్గం చూడాలంటే చాలా ఖర్చు అవుతుందని చెప్పాడు ఆ సాధువు. మా నానమ్మను అడిగి డబ్బు తీసుకు వస్తానన్నాడు నాని. ‘స్వర్గంలో మీ డబ్బులు చెల్లవు. అక్కడ మంచితనం, పుణ్యం అనే రూపాయలే చెల్లుతాయి’ అని చెప్పి ఒక డిబ్బీ నానికి ఇచ్చాడు. ‘నీవు ఎప్పుడైనా ఓ మంచి పని చేస్తే ఈ డిబ్బీలో ఓ రూపాయి వచ్చి పడుతుంది. అలాగే ఓ చెడ్డపని చేశావనుకో, దీన్లోంచి ఓ రూపాయి మాయమైపోతుంది. పుణ్యం అనే రూపాయలతో ఈ డిబ్బీ నిండిపోగానే నీవు స్వర్గం చూడగలుగుతావు’ అని చెప్పాడు సాధువు.
డిబ్బీని త్వరగా నింపి స్వర్గం చూడాలని ఆరాటపడుతున్నాడు నాని. ఓ రోజు నానికి నానమ్మ ఒక రూపాయి ఇచ్చింది. దారిలో కనబడిన బిచ్చగాడు దానం చేయమని అడిగాడు. మనసులో ఇవ్వొద్దని ఉన్నా, నలుగురి మెప్పు కోసం దానం చేశాడు. ఇంటికి వెళ్లగానే నాని డిబ్బీ తెరిచి చూశాడు. అది ఖాళీగా కనపడింది. అతనికి దుఃఖం వచ్చింది. సాధువు దగ్గరికి వెళ్లి విషయం చెప్పాడు. ‘ఇతరుల మెప్పు పొందాలని దానం చేశావు. అందువల్ల నీకు మెప్పు దొరికింది కానీ, పుణ్యం దొరకలేదు. లాభం కోరి చేసే ఏ మంచి పని అయినా అది వ్యాపారం అవుతుంది కాని పుణ్యకార్యం కాదు’ అని చెప్పాడు.
ఓ రోజు మిత్రుడు చందుకు జ్వరం వచ్చిందని చూడటానికి వెళ్లాడు నాని. చందును పరీక్షించిన వైద్యుడు అతనికి మందులు ఇచ్చి, నారింజ పండ్ల రసం తాగించమని అతని తల్లితో చెప్పాడు. ఆమె చాలా పేదరాలు కావడం వల్ల నారింజ పండ్లు కొనే స్తోమత లేదని బాధ పడింది. నాని రెండు నారింజ పండ్లను కొని ఆమె చేతిలో పెట్టాడు. ఆమె అతణ్ని మనసారా దీవించింది. ఇంటికి వచ్చిన తర్వాత నాని డిబ్బీ తెరిచి చూస్తే అందులో కొన్ని రూపాయలు కనిపించాయి. రోజులు గడిచిపోసాగాయి. నాని డిబ్బీ కాసులతో కళకళలాడుతున్నది. ఓ రోజు చెల్లెలితో ఆడుకుంటూ ఆమెను కొట్టాడు నాని. ఇంటికి వెళ్లాక డిబ్బీలో కొన్ని రూపాయలు తక్కువగా ఉండటం గమనించాడు. పశ్చాత్తాపం చెందాడు. ఇకపై చెడుపనులు చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు.
కొన్ని రోజులకు నాని డిబ్బీ పుణ్యమనే రూపాయలతో నిండిపోయింది. స్వర్గం చూడాలన్న ఉత్సాహంతో డిబ్బీని తీసుకొని సాధువు దగ్గరికి వెళ్లాడు నాని. ఆయన కుర్రాణ్ని చూసి ఏడుపు నటించడం మొదలుపెట్టాడు. ‘స్వామీ! ఎందుకు ఏడుస్తున్నారు?’ అని అడిగాడు నాని. అప్పుడు సాధువు ‘బాబూ! నీ దగ్గరున్న డిబ్బీలాంటిదే నా దగ్గరా ఉండేది. ఎన్నో రోజులు కష్టపడి దాన్ని నింపాను. ఎంచక్కా స్వర్గం వెళ్లొచ్చని ఆశపడ్డాను. కానీ, ఆ డిబ్బీ నదిలో పడిపోయింది’ అని బావురుమన్నాడు. అప్పుడు నాని ‘మీరు బాధపడకండి స్వామి! నా డిబ్బీ నిండా రూపాయలున్నాయి. దీన్ని తీసుకోండి. నేను ఇంకా చిన్న పిల్లవాడినే. ఇలాంటి డిబ్బీలు ఎన్నో నింపడానికి నాకు అవకాశం ఉంది. కానీ, మీరు పెద్దవారయ్యారు. కాబట్టి తీసుకోండి’ అని ఇచ్చాడు. సాధువు డిబ్బీ తీసుకొని తన చేతులతో నాని కండ్లపై నిమిరాడు. ‘నువ్వు కండ్లు మూసుకో నీకు స్వర్గం కనిపిస్తుంది’ అన్నాడు. నిజంగానే నానికి స్వర్గం కనిపించింది. నానమ్మ వర్ణించిన దానికన్నా అది ఎంతో గొప్పగా ఉంది అనిపించింది. నాని ఆనందంగా కళ్లు తెరిచాడు. సాధువుకు బదులు అక్కడ దేవుడు ఉన్నాడు. ‘నాయనా! మంచి పనులు చేసే వాళ్లకు ఇలా స్వర్గం కండ్ల ఎదుటే నిలుస్తుంది. నీవు ఇలాగే మంచి పనులు చేస్తూ ఉండు. చివరికి స్వర్గం చేరుకుంటావు’ అని చెప్పి దేవుడు అంతర్ధానం అయ్యాడు. స్వర్గం చేరుకోవాలంటే మంచితనం ఒక్కటే మార్గం అని ఈ చిట్టి కథ చెబుతుంది.
నూతి
7337555084