నాలుగేండ్ల బాలుడు పరాకుగా ఉండి, పూజగదిలో దేవుడి ముందు దీపాన్ని ముట్టుకున్నాడు. అతని వేళ్లు దీపానికి తగిలి చురుక్కుమన్నాయి. భయంతో వేళ్లను వెనక్కి లాక్కున్నాడు. వేళ్లకు గాయమైంది. ఆ గాయం తాలూకు భయం ఆ పిల్లాడి మనస్సులో ముద్రపడిపోయింది. కాలక్రమంలో చేతి గాయం మానింది. కానీ, మనసులో భయం ముద్ర మాత్రం జీవితాంతం ఉండిపోయింది. ప్రతి మనిషి జీవితంలో కూడా శారీరక కర్మల ప్రభావం కన్నా, మానసిక కర్మల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనం ఏ పనిచేసినా రెండు రకాల ఫలితాలు కలుగుతాయి. ఒకటి బాహ్యంగా కనిపిస్తుంది. రెండోది మనసులో నిక్షిప్తమవుతుంది. అక్కడ బాలుడి చేతికి గాయమవటం ఒక ఫలితం. మనసులో నిప్పు వల్ల కలిగిన భీతి పొడచూపటం మనసుకు మిగిలిన మరో ఫలితం. మంచి పనిచేసినా, చెడు పనిచేసినా బాహ్య ప్రపంచంలో కనిపించే ఫలితం కన్నా, మన మనోఫలకంపై దానికి సంబంధించిన చిహ్నం చిరకాలం ఉంటుంది. అలా మనసులో సత్కర్మలు, దుష్కర్మల వల్ల ఏర్పడిన ముద్రలు కాలక్రమంలో సంస్కారాలుగా పరిణమిస్తాయి.
సమాజంలో ఇలాంటి సంస్కారాల ప్రభావం వల్ల ఒక్కో మనిషి ఒక్కో రీతిలో ప్రవర్తిస్తూ ఉంటాడు. కొందరు ఏ చిన్న ప్రలోభానికైనా లొంగిపోయి, తప్పటడుగులు వేస్తారు. మరికొందరు ప్రాణాల మీదికి వచ్చినా, తాము నమ్ముకున్న సిద్ధాంతం నుంచి అంగుళం కూడా పక్కకు జరగరు. తమ ఆత్మగౌరవానికి భంగం కలగనీయరు. రామకృష్ణ పరమహంస తండ్రి న్యాయస్థానంలో తప్పుడు సాక్ష్యం చెప్పటం ఇష్టం లేక, ఊరినీ, ఆస్తిపాస్తుల్ని వదులుకొని కుటుంబంతో పొరుగూరికి వలస వెళ్లిపోయాడు. అలా తప్పుడు సాక్ష్యం చెప్పటానికి ఆయన సంస్కారం అంగీకరించలేదు. ఆ సన్నివేశం పరమహంస మనస్సులో ప్రగాఢంగా పడింది. అందుకే యుక్త వయసులో దక్షిణేశ్వరంలో పూజారిగా ఉన్నప్పుడు ఆయన కూడా ఎలాంటి ప్రలోభాలకూ లొంగలేదు. మనసు ఎంత సుసంపన్నమైతే జీవితం అంత సార్థకమవుతుంది. పదిమందికీ ఆదర్శమవుతుంది.
ఆధునిక జీవనపు అలజడిలో యథాలాపంగా జీవించటం అలవాటైపోయింది. ఆత్మావలోకనానికి, విచక్షణకు, వివేకానికి తావులేకుండా, ప్రలోభాల ప్రభావానికి లొంగిపోవటం సర్వసాధారణమైపోయింది. దురదృష్టకరమైన విషయమేమంటే మనకు మనం సరిగ్గా ఆలోచించుకునే వెసులుబాటు కల్పించుకోవడం లేదు. నియమాలకు, నిర్దుష్టమైన విలువలకు కట్టుబడి ఉండే నిబద్ధతకు ఎన్నడో తిలోదకాలు ఇచ్చేశాం. రుజువర్తన దిశగా మనసుకు శిక్షణ ఇవ్వటంలో తరచూ మనం విఫలమవుతున్నాం. ‘ఒక్కసారి చేస్తే ఏమవుతుందిలే?’ అని ఎవరికివారు సమర్థించుకుంటూ తప్పటడుగులకు అలవాటు పడిపోతున్నాం. ఒక్కసారి ప్రలోభాలకు లొంగిపోవటం, బలహీనతలకు బందీ కావటం ప్రారంభిస్తే అవి అంత సులువుగా మనల్ని వదలవు. ఆ ప్రలోభాల ప్రభావం మన మనసును అంత సులువుగా వదిలిపెట్టదు. మళ్లీ మళ్లీ ఆ రుచి కోసం మనసు వెంపర్లాడుతుంది. అందుకే విచక్షణను పాటించి ‘ఈ పనిని చేయటం అవసరమా? కాదా?’ అని ఆత్మావలోకనం చేసుకోవాలి. మంచి ఏదో, చెడు ఏదో వివేకంతో తెలుసుకొని మసలుకోవాలి.
‘పిరికితనం అడుగుతుంది
ఆ పనిచేయటంలో ప్రమాదం లేదు కదా! అని దురాశ అడుగుతుంది.
ఆ పని చేయటం వల్ల లాభం వస్తుందా! అని అహంకారం అడుగుతుంది. ఆ పనిచేస్తే నాకు పేరొస్తుందా? అని కానీ, ఒక్క అంతరాత్మ మాత్రమే అడుగుతుంది.
ఆ పనిచేయటం సక్రమమేనా! అని’అన్న అబ్దుల్ కలామ్ మాటలు ఒక్కసారి గుర్తుచేసుకుందాం.
మనోజ్ఞ