9 అంకెతో ముడిపడిన అద్భుత ప్రాజెక్టు
విశిష్టాద్వైత ప్రవర్తకులు.. సమసమాజ స్థాపనాచార్యులు.. భక్తి ఉద్యమ పరివ్యాప్తికి సారథ్యం వహించిన భగవద్రామానుజుల 216 అడుగుల ఎత్తయిన సమతామూర్తి విగ్రహావిష్కరణకు ముచ్చింతల్లోని దివ్యసాకేతం ముస్తాబైంది. ప్రముఖుల సమక్షంలో అద్భుతంగా అవతరించే సన్నివేశం ఆసన్నమైంది. ఈ అపూర్వ ఆవిష్కరణకు మూలకారకులైన శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి ఆశ్రమం ఆధ్యాత్మిక శోభతో నిరుపమానంగా అలరారుతున్నది. ఐదు వేల మంది రుత్విక్కులతో సహస్రకుండాత్మక లక్ష్మీనారాయణ యాగానికి సర్వ సన్నాహాలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 2 నుంచి 12 రోజుల పాటు జరిగే రామానుజుల సహస్రాబ్ది వేడుకలు,
సమతామూర్తి ఆవిష్కరణ ఉత్సవాల విశిష్టత, వాటికి సంబధించిన ఏర్పాట్లను జీయర్ స్వామి ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. ఆ విశేషాలు..
రామానుజుల వారి సమతామూర్తి దేనికి ప్రతీక?
సమానత్వం అనేది ఒక జీవన విధానం. వెయ్యేండ్ల క్రితం పరిస్థితులు ఎలా ఉండేవనేది ఒకసారి ఆలోచించాలి. నాటి పరిస్థితులతో నేటి పరిస్థితులను పోల్చలేం. అప్పటికాలంలో అంటరానితనం తీవ్రంగా ఉండేది. మహిళలు తమ ఆంక్షల పరిధిని దాటి బయటకు వచ్చే పరిస్థితులు లేవు. బ్రాహ్మణులదే ఆధిపత్యం. అణగారిన వర్గాలకు చదువులాంటిది దూరం. ఆ సమయంలోనే.. అంటే.. 11వ శతాబ్దంలో అవతరించిన రామానుజులు.. సమసమాజం ఉండాలని ఆకాంక్షించారు. ఆ సమాజంలో మహిళలు ముందువరుసలో ఉండాలని కోరుకొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు అన్ని అవకాశాలూ సమానంగా అందాలని ప్రబోధించారు. దీంతో ఆగ్రహించిన బ్రాహ్మణుల్లో కొందరు వ్యతిరేకించారు. రామానుజుల వారికి తీర్థంలో, భోజనంలో విషాన్ని కలిపారు. కానీ.. దైవానుగ్రహంతో వారికి ఏమీ కాలేదు. వారు ఇలాంటి పరీక్షలు ఎన్నింటినో ఎదుర్కొన్నారు. అందుకే వారు చూపిన మార్గం ప్రకారం సమానత్వమనేది ఒక జీవన విధానం. ఒకరు ఎక్కువ కాదు.. ఒకరు తక్కువా కాదు. ఉచ్ఛనీచ భేదాలతో అందరూ కలిసి ఉన్నా అది సమాజానికి లాభం చేయదు. అందుకే రామానుజులు సమానత్వంతోకూడిన సమాజాన్ని ప్రవచించారు. ఇలాంటి ఆలోచనా ధోరణులకు సమతామూర్తి ప్రతీకగా నిలుస్తుంది.
సమతామూర్తి యువతకు ఎలాంటి ప్రేరణనిస్తుంది?
అవును.. సమతామూర్తి యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తుంది. ఎందుకంటే.. ఇప్పుడు యువత ఆధ్యాత్మికతపై ఆసక్తిని ప్రదర్శిస్తున్నది. రిటైరైనవారు మరింత సంపాదించాలనే ఉద్దేశంతో రెండో ఆదాయం కోసం అర్రులు చాస్తున్నారు. ఈ సృష్టిలో ఏది యథార్థం? ఏది అబద్ధం? అనే అంశాలను తెలుసుకోవడం కోసం యువత ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నది. ఇది చాలా మంచి పరిణామం.
ఆళ్వారుల గురించి చెప్పండి?
ఆళ్వారు అంటే.. భగవంతుడి గురించిన అనంతమైన జ్ఞానంలో మునిగిపోయినవారని అర్థం. నిజానికి వాళ్ళుకూడా మనలాంటి సామాన్యులే. కానీ అకస్మాత్తుగా వారు ఒక అనిర్వచనీయమైన, అద్భుతమైన, అనంతమైన భక్తి తదాత్మ్యానికి లోనయ్యారు. భక్తి గీతాలను ఆలపించేవారు. అలా ఆలపించడం ద్వారా ఆ భగవంతుని సాన్నిహిత్యాన్ని పొందిన అనుభూతికి లోనయ్యేవారు. వాళ్ళెవరు? వారు బ్రాహ్మణులా, వేదకాలం నాటి తత్తవేత్తలా? కాదు. వారిని భగవంతుడు ఎంచుకొన్నారు. దేవుడిని వీరు ఎంచుకోలేదు. దేవుడు వారిని ఎంచుకొన్నారు కనుకనే అకస్మాత్తుగా వారు భక్తి గీతాలు రాసి, పాడేవారు. ఆ దేవుడి జ్ఞానసాగరంలో మునిగి తేలేవారు. ఇలా 12 మంది ఆళ్వారులు ఉండేవారు. ఇందులో ఒక బ్రాహ్మణుడు, ఒక రాజు, ఒక మ్లేచ్ఛుడు, ఒక హరిజనుడు, ఒక స్త్రీ.. ఇలా అన్ని వర్గాలవారున్నారు. వీరందరూ కుల వ్యవస్థకు ఎగువన ఉండేవారు.
వివక్షకు వ్యతిరేకంగా సమతామూర్తి ఇవాళ్టి సమాజంలో ఎలాంటి చైతన్యం కలిగిస్తుంది?
రామానుజుడు అప్పటికాలంలో వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. సమాజంలో చైతన్యం కల్పించారు. అందరూ సమానమనే తత్వాన్ని బోధించారు. అప్పట్లో రామానుజుడి బోధనలు, ఆయన చెప్పిన మాటలు, ఆయన చూపిన దారి, ఆయన మూర్తిమత్వం, ఆయన జ్ఞానం ఇవి సమాజంలో చైతన్యం కలిగిస్తాయి. ఏ కాలంలోనైనా ఇవి మాత్రమే సమాజంపై ప్రభావం చూపే అంశాలు. అందుకే ఆయన విగ్రహం ఏర్పాటుద్వారా ఆ చైతన్యాన్ని తీసుకురావాలని సంకల్పించాం.
ఇంత విశిష్టమైన ప్రాజెక్టుకు స్థానికుల నుంచి, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందుతున్నది?
రామానుజుడు జన్మించి 2017 నాటికి వెయ్యి సంవత్సరాలు అయ్యింది. కొన్ని కారణాల వల్ల అప్పుడు ఇలాంటి ఉత్సవాలు చేయలేకపోయాం. నిజానికి ఈజిప్టులోని ఫారోస్ లాగా.. తమిళనాడులో ఒక పర్వతంపై రామానుజుడి విగ్రహం ఏర్పాటు చేద్దామనుకున్నాం. అలాంటి పర్వతం మాకు లభించలేదు. విగ్రహం ఏర్పాటుకు కావాల్సిన స్థలం కూడా దొరకలేదు. ఆ సమయంలో డాక్టర్ జూపల్లి రామేశ్వర్రావు ముందుకు వచ్చి దాదాపు 15 ఎకరాల స్థలాన్ని వేద పాఠశాలకోసం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ విగ్రహం పెట్టాలని నిర్ణయించాం. దీనికి కూడా రామేశ్వర్రావు మరికొంత స్థలాన్ని ఇచ్చారు. విగ్రహం ఏర్పాటుకు కావాల్సిన టెక్నాలజీ, ఆర్కిటెక్చర్లు, శిల్పులు, ఇతర సహకారాన్ని కూడా అందించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అంతకంటే పైస్థాయిలో కావాల్సిన అన్ని రకాల సహకారం.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్నది. 2003లో తిరుమలలో ఒక సంఘటన జరిగింది. వెయ్యికాళ్ల మంటపం వంటి నిర్మాణాలను తొలిగించారు. ఈ చర్యను చాలామంది ఖండించారు. జనవరి 2005 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ‘ఓం నమో వేంకటేశాయ’ అనే నామాన్ని 1,100 కోట్ల సార్లు రాసి పంపించారు. వీటిని కూడా భద్రపర్చాల్సి వచ్చింది. ఇందుకోసం ఇక్కడి స్థలం అనువైనదిగా గుర్తించాం. ఇక్కడే భద్రపర్చి.. దానిపైన ఒక టవర్ను నిర్మించాం.
వేంకటేశ్వరస్వామి రామానుజుడి శిష్యుడని చెప్తారు?
నిజమే. వేంకటేశ్వరస్వామి రామానుజాచార్యుడి శిష్యుడే. ఒకానొక సమయంలో ఏడు కొండలపై ఎవరుండాలనేదానిపై వాదోపవాదాలు, చర్చలు జరిగాయి. ఈ సమయంలో అక్కడి రాజు.. పండితులతో సమావేశం ఏర్పాటుచేసి ఎవరు ఉండాలనేది నిర్ణయించాలని కోరారు. దీనికి రామానుజులు కూడా వస్తారు. పదకొండు పురాణాల్లోనూ చెప్పినట్టుగా విష్ణుమూర్తియే అక్కడ కొలువై ఉండాలని స్పష్టంగా పేర్కొంటారు. ఇతరులు దీనిని వ్యతిరేకిస్తారు. దీనితో వివిధ దేవతల అభరణాలు, ఆయుధాలను ఒక్కడ వదిలి వెళదామని.. తెల్లవారేసరికి శంఖం, చక్రం ధరిస్తే.. ఆయనే విష్ణుమూర్తి.. అని అందరూ ఒప్పుకోవాలని నిర్ణయిస్తారు. తెల్లవారేసరికల్లా శంఖం, చక్రం మాత్రమే స్వామివారి చేతుల్లో అభరణాలుగా అలంకరించి ఉంటాయి. యథార్థంగా గురువులే శిష్యులకు శంఖుచక్రాలను ప్రసాదిస్తారు. ఇదే తరహాలో రామానుజుల నుంచి వేంకటేశ్వరస్వామి శంఖుచక్రాలను అందుకొన్నారు కాబట్టి.. రామానుజులవారిని వేంకటేశ్వరస్వామికి గురువుగా పరిగణిస్తారు.
పెద్దజీయరు స్వామి రామ మహా క్రతువు చేసి 108 రామ స్థూపాలు ఏర్పాటు చేశారు.. ఇక్కడ 108 దివ్యదేశాలు ఏర్పాటుచేస్తున్నారు!
రామానుజులవారు 108 ప్రదేశాల నుంచి స్ఫూర్తి పొందారు. అందుకే ఇక్కడ కూడా 108 దివ్య దేశాలను ఒకేచోట ఏర్పాటు చేస్తున్నాం. అంతేగానీ.. దానికి దీనికి ఎలాంటి సంబంధంలేదు. నిజానికి ఈ ప్రాజెక్టు మొత్తం 9 అంకెతో ముడిపడి ఉన్నది. సమతామూర్తి విగ్రహం ఎత్తు 216 అడుగులు. మొత్తం కూడితే 9 వస్తుంది. ఆయన కూర్చున్న పద్మ పీఠం 27 అడుగుల ఎత్తు ఉం టుంది. ఆయన చేతిలోని దండం కూడా 9 అంకె వచ్చే లా ఏర్పాటుచేశాం. 9 అంకెకు ఒక విశిష్టత ఉన్నది. ఏ అంకెతో గుణించినా.. వచ్చిన అంకెలను కలిపితే 9 వస్తుంది. రామానుజులవారు.. వారి గురువు వద్దకు 18 సార్లు వెళ్లిన తరువాతనే మంత్రోపదేశం లభించింది. అది కూడా 9 వస్తుంది. ఇక్కడి యజ్ఞశాలలో 1035 యాగకుండాలు ఏర్పాటుచేశాం. ఇలా ప్రతి విషయంకూడా 9 తో ముడిపడి ఉన్నాయి. అందుకే ఇక్కడి ప్రా జెక్టు కూడా అదే 9 తో ముడిపడేలా ఏర్పాటుచేస్తున్నాం.
సమతామూర్తి విగ్రహావిష్కరణ ఉత్సవాలకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి?
ఏర్పాట్లు చాలా వేగంగా పూర్తవుతున్నాయి. యజ్ఞకుండాలతో యాగశాల పూర్తయ్యింది. 1.5 లక్షల కిలోల స్వచ్ఛమైన ఆవు నెయ్యి సిద్ధమైంది. దీనిని ప్రత్యేకంగా తయారుచేశారు. వేదాల్లో సూచించినట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం దేశం నలుమూలల నుంచి సుమారు 5 వేల మంది వేద పండితులు వస్తున్నారు. ఫిబ్రవరి 2 నుంచి పన్నెండు రోజులపాటు ఇవి జరుగనున్నాయి. ఇందుకోసం రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ 13న వస్తారు. ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ సమతామూర్తిని ఆవిష్కరిస్తారు. ఈ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు.. అనేక మంది ప్రముఖులు, వేలమంది ప్రజలు పాల్గొంటారు.
వందే గురుపరంపరాం అని విశిష్టాద్వైతంలో అత్యున్నత మార్గంగా చెప్తారు కదా.. ఈ ఆచార్య పరంపరలోని విశిష్టత ఏమిటి?
శక్తి (పవర్) అనేది రెండు రకాలుగా వస్తుంది. ఒకటి డైనమో తిప్పితే వస్తుంది. అలాగే హైటెన్షన్ తీగలోంచికూడా వస్తుంది. డైనమో నుంచి మీరు శ్రమించేదానిని బట్టి శక్తి పుడుతుంది. కానీ హైటెన్షన్ చాలా ఉంటుంది. ఎవరికి వారు స్వయంభూ ఆచార్యగా మారితే వచ్చే జ్ఞానం కంటే.. ఒక పరంపరలో ముందటి వారి నుంచి అందుకొనే జ్ఞానం అత్యున్నతమైనది. ఇక్కడ దేవుడు మొట్టమొదటి గురువు. ఆ జ్ఞానం, శక్తి అనేది రామానుజుల ద్వారా ఒక పరంపర (లీనియేజ్)గా సంక్రమిస్తూ వచ్చింది. తద్వారా అపారమైన జ్ఞానం లభిస్తుంది. అందుకే ఆచార్య పరంపర అంటారు. అదే ఉత్కృష్టమైనది.