వనపర్తి : ఫ్రంట్ లైన్ వారియర్స్గా వైద్యులు అందిస్తున్న సేవలను వెలకట్టలేనివని మరోమారు రుజువైంది. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకుంటున్నారు వైద్యులు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆపదలో ఉన్న రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని పెద్దమందడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా సోకిన గర్భిణికి ప్రభుత్వ వైద్యులు ప్రసవం చేశారు. పెద్దమందడి మండలం చిలుకటోని పల్లి గ్రామానికి చెందిన 29 ఏండ్ల గర్భవతికి కరోనా పాజిటివ్ వచ్చింది. పురిటి నొప్పులతో దవాఖానకు రాగా డాక్టర్లు ఇస్మాయిల్, సాయితేజతో పాటు స్టాఫ్ నర్స్ నిరీక్షణ, ఆయా మాధవి వైద్యసేవలు అందించారు.
మగ బిడ్డ జన్మించాడని, తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని జిల్లా వైద్యాధికారి చందునాయక్ తెలిపారు. ప్రాణాలకు సైతం తెగించి వైద్యం అందించిన వైద్య సిబ్బందిని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అభినందించారు.