హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): అనేక బాధలుపడి, 60 ఏండ్లు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని చెదరనివ్వకుండా కాపాడుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. టీఆర్ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాగునీరు, వైద్యం, సాగునీళ్లు ఇలా అనేక రంగాల్లో బాగు చేసిందని తెలిపారు. ప్రజలకు నచ్చిన పనులు చేస్తున్నాం కాబట్టే తమను ఆదరిస్తున్నారని, తాము ఎవరికీ భయపడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర నుంచి హక్కుగా ఇచ్చేవి కూడా తామేదో గొప్పగా ఇచ్చినట్టు చెప్తున్నారని బీజేపీని ఉద్దేశించి విమర్శించారు. ప్రగతిభవన్లో సోమవారం మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ అనేక అంశాలపై మాట్లాడారు.
మా బాధ్యత సక్కగ చేస్తున్నాం
రాష్ట్రంలో బాధ్యత తీసుకున్నాక.. మంచినీళ్లు సరఫరా, వైద్యం అందించడం సజావుగా సాగిస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పా రు. అంతమాత్రానికే తాము గొప్పలు చెప్పుకోవడం లేదన్నారు. ‘పన్నుల పైసలు నేషనల్ హైవేలకు ఇచ్చినం అంటే ఇయ్యవా? రైల్వే లైన్లకు ఇవ్వాల్సిందే కదా! మంచి మాటకు ఇయ్యకుంటే చెడ్డమాటగా ప్రజలే తీసుకుంటారు.. ఊకుంటరా.. దంచి నిలిదీసి అడుగుతరు’ అని సీఎం కేసీఆర్ సూటి గా చెప్పారు. పన్నుల వసూలు రాష్ర్టాలకే ఇస్తే జాతీయ రహదారులు, రైల్వే ట్రాక్లు తామే ఏర్పాటు చేసుకుంటామన్నారు. ‘అన్ని రాష్ర్టాలకు ఇచ్చినట్టే తెలంగాణలోనూ జాతీయ రహదారులకు నిధులిచ్చారు. అందులో ఏంది గొప్ప?’ అని నిలదీశారు.
నిజాయితీగా ప్రభుత్వాన్ని నడుపుతున్నం
నిజాయితీగా, క్రమశిక్షణతో ప్రభుత్వాన్ని నడుపుతున్నందుకే రాష్ట్రంలో ప్రగతి కనిపిస్తున్నదని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో అధికారుల వేధింపులు, లంచాల బాధ లేదని పారిశ్రామికవేత్తలు సైతం పొగుడుతున్నారని తెలిపారు. బీజేపీ రాష్ర్టాల్లో ఎక్కడైనా రెవెన్యూ డిజిటలైజేషన్ జరిగిందా? అని నిలదీశారు.
ప్రజలే మా బాస్లు
‘టీఆర్ఎస్కు, కేసీఆర్కు ఎవడూ బాస్ లేడు. మాకు ఉన్నది ఒకే ఒక్క బాస్ తెలంగాణ ప్రజలు’ అని కేసీఆర్ మరోసారి కుండబద్దలు కొట్టారు. ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. ప్రజలు గెలిపిస్తే సర్వీస్ చేసినం.. అపోజిషన్లో ఉండమంటే ఉంటం.. రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఏ పాత్ర ఇచ్చినా పనిచేస్తాం.. మీలాగ (బీజేపీని ఉద్దేశించి) మేం చంగడ బింగడ దుంకలే.. అతికిపోలేదు’అని సీఎం కేసీఆర్ అన్నారు.
మా భూములు కూడా పోయాయి
రాష్ట్రం కోసం కట్టిన ప్రాజెక్టుల్లో మావి వేల ఎకరాల భూములు పోయినవి, మానేరు ప్రాజెక్టుల కింద మాది, మా అత్త గారోల్ల భూమి కూడా పోయింది. అవకాశం ఉన్న కాడ కొంత భూమి కొనుకున్నాం. బాజాప్తా వ్యవసాయం చేసుకుంటున్నాం’ అన్నారు.
రాష్ట్ర సృష్టికర్తను నేను
నువ్వు (బండి) ఒక తోకగానివి. ఎంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సృష్టించిండు కేసీఆర్! టీఆర్ఎస్పార్టీ ఎంతోమంది కొత్త రాజకీయ నాయకత్వాన్ని సృష్టించింది ఈ రాష్ట్రంలో. నేను ఒక రాష్ట్ర సృష్టికర్తను, ఒక జెండా సృష్టికర్తను.. ఇవన్నీ వాస్తవాలు కాదా? దేశంలో ఎక్కడా లేని పథకాలు, ఎవరు ఊహించని పథకాలు ఎన్నో సృష్టించాం మేం. రైతుబీమాను ఇచ్చిన మొగోడు ఎవరైనా ఉన్నాడా? మిషన్ భగీరథ వంటి పథకం కల్పన చేశారా మీరు?
ఎవరికీ భయపడేది లేదు
మేం ఎవరికి భయపడేది లేదు.. ‘మై ఆందోళన్కారీ ఆద్మీహూ.. మై కిసీసే నహీ డర్తా..’ ఇంకో 20 ఏండ్లు ప్రభుత్వంలో నేనే ఉంటానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబునాయుడు.. ఆయన శాసించే ఎన్డీఏ ప్రభుత్వమే కేంద్రంలో ఉన్న సమయంలో పర్వతాన్ని ఢీకొట్టిన పద్ధతిలో నాకు ఉన్న పదవులు విసిరికొట్టి.. తెలంగాణ ఉద్యమాన్ని పిడికెడు మందితో ప్రారంభించిన. నన్నా మీరు మాట్లాడేది.. కేసీఆర్ మీదనా నువ్వు (బండి) మాట్లాడేది’ అంటూ సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు.