పెద్ద కొడప్ గల్ (పిట్లం), ఫిబ్రవరి 26 : నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం అల్లాపూర్ గ్రామంలో గురువారం చత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంతర్గం పీఠాధిపతి కరణ్ మహరాజ్, జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చత్రపతి శివాజీ విగ్రహాన్ని కరణ్ గజేంద్ర భారతి మహరాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరణ్ మహరాజ్ మాట్లాడుతూ.. శివాజీ జీవితం, ఆయన చేసిన ధర్మపరమైన పోరాటాలు, ప్రజల స్వేచ్ఛ కోసం సాగించిన యుద్ధాలు స్ఫూర్తిదాయకం అన్నారు.
ధర్మం, న్యాయం, స్వాభిమానంతో పాలన చేసిన శివాజీ జీవితాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ..శివాజీ చూపిన ధైర్యం, నాయకత్వం, ప్రజల పట్ల ఉన్న ప్రేమ ప్రతి ఒక్కరూ జీవితంలో అలవర్చుకోవాలని సూచించారు. ఇలాంటి మహానుభావుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.