తెలంగాణ ప్రాంతంలో సంస్థానాల పరిధిలో జరిగిన సాహిత్య కృషి ప్రత్యేకంగా పేర్కొనదగింది. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాంతంలో సంస్థానాలు ఎందరో కవి పండితులకు ఆవాసమై సాహిత్య సుగంధాలను వెదజల్లాయి. ఆ సంస్థానాల్లో గద్వాల, వనపర్తి, అమరచింత, జటప్రోలు, గోపాలపేట సంస్థానాలు ప్రధానమైనవి. వాటిలో వనపర్తి ప్రాంతంలోని వనపర్తి, అమరచింత, గోపాలపేట మొదలైన సంస్థానాలు సాహిత్య రంగాన్ని ప్రశంసనీయంగా పోషించాయి.
ఎన్నో అమూల్యమైన గ్రంథాలను రామకృష్ణ కవిచే రాజా రామేశ్వరరావు పరిష్కరింపజేశారు.‘బ్రహ్మ విలాస ముద్రాక్షర శాల’నునెలకొల్పారు. ఆ ముద్రణాలయం తెలంగాణలోనే ప్రప్రథమమైనదిగా పేర్కొంటారు.
ఎనిమిది భాషల్లో ప్రవీణుడైన గోపాలరావు కాలం నుంచి వనపర్తి సంస్థానాధీశుల వంశంలో సాహి త్య కృషి జరిగినట్టు తెలుస్తున్నది. ‘బహిరీ’ బిరుదాంకితుడైన గోపాలరావు సంస్కృతంలో కావ్య నాటకాలను రచించారు. రెండవ రామేశ్వరరావు కాలంలో వనపర్తి సంస్థానం అభివృద్ధి పథంలో ప్రయాణించింది. ఆయన పరిపాలన 1922 వరకు కొనసాగింది. రామేశ్వరరావు హయాంలో, ఆయన తల్లి రాణీశంకరమ్మ హయాంలో నిర్వహించిన విద్వత్సభలు జనమనోరంజితంగా కొనసాగాయి. ఆ సభలకు గద్వాల, ఆత్మకూరు సంస్థానాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా కవులు, పండితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేవారు. ఈ సంస్థానం పరిధిలోని రాజనగరంలోనూ సాహిత్య సభలు జరిగేవి. ‘వనపర్తి’ సంస్థాన పద్య కావ్య రచయిత నెమలూరి వేంకటశాస్త్రి ఆ సభలను నిర్వహించేవారు. మైసూరు నుంచి వచ్చిన కాశీసుబ్రహ్మణ్యశాస్త్రి తో అచ్చంపేట నరసింగయ్య శాస్త్రి, వట్టెం ఖండవల్లి నరసింహశాస్త్రి వ్యాకరణంపై చర్చలు జరిపారని తెలుస్తోంది.
ఈ సంస్థానం పరిధిలోని శ్రీరంగాపురం గ్రామానికి చెందిన పండితులు గుడిమంచి సుబ్రహ్మణ్య శాస్త్రి ‘భావ కల్పక శిరోమణి’ అనే బిరుదాంకితులు. సుప్రసిద్ధ పండితులు తిరుపతి వేంకటకవులు కూడా రెండవ రామేశ్వరరావు కాలంలో శ్రీరంగాపురం గ్రామాన్ని సందర్శించారు. రెండవ రామేశ్వరరావు అనేకమంది సుప్రసిద్ధ కవులను, పండితులను వనపర్తి సంస్థానానికి ఆహ్వానించారు. వారిలో మానవల్లి రామకృష్ణ కవి ఒకరు. మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో డిగ్రీ చదివిన ఆ కవి 1904లో వనపర్తి రాజా రామేశ్వరరావుకు ఆంతరంగిక కార్యదర్శిగా ఉద్యోగంలో చేరారు. ఎన్నో అమూల్యమైన గ్రంథాలను రామకృష్ణ కవిచే రామేశ్వరరావు పరిష్కరింపజేశారు. ఆ గ్రంథ ముద్రణ కూడా స్వయంగా చేపట్టా రు రామేశ్వరరావు ప్రభువు. ‘బ్రహ్మ విలాస ముద్రాక్షర శాల’ను నెలకొల్పారు. ఆ ముద్రణాలయం తెలంగాణలోనే ప్రప్రథమమైనదిగా పేర్కొంటారు.
రామకృష్ణ కవి పరిష్కరించిన గ్రంథాలను
ఆ ముద్రణాలయం ద్వారా వెలువరించారు. కుమార సంభవం (1908), క్రీడాభిరామం (1909), నీతిసార ముక్తావళి (1910), ప్రబం ధ మణిభూషణం (1910), పరతత్త్వ రసాయనం (19 11), అనర్ఘ రాఘవం (1911), త్రిపురాంతకోదాహరణం (1912), శ్రీరంగ మహాత్మ్యం (1912) అనే 8 గ్రంథాల ప్రచురణ భారాన్ని రామేశ్వర రావు భరించారు.
వనపర్తి ఆస్థాన ఉద్యోగిగా రామకృష్ణ కవి తెలంగాణలో విస్తృతంగా పర్యటించి, 400కు పైగా శాసనాలను సేకరించారు. ‘లిథిక్ రికార్డ్స్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్’ అనే పేరుతో ఆ శాసనాలు ప్రచురితమయ్యాయి. గ్రంథ సేకరణ, పరిష్కరణలో తనకుతానే సాటిగా పేరు పొందారు మానవల్లి రామకృష్ణ కవి. రెండవ రామేశ్వరరావు పౌత్రుడు మూడవ రామేశ్వరరావు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎంపీగా చాలాకాలం ఉన్నారు. ఆయన పలు విద్వత్సభలు నిర్వహించారు. ఆయన ప్రోత్సాహం, ఆర్థికసాయంతో బేతనభట్ల విశ్వనాథం అనే ఓయూ గణిత ఆచార్యులు ‘ఆధునిక విజ్ఞాన వికాసము’ అనే గ్రంథాన్ని రచించారు. వనపర్తి సంస్థానంలోని వామన్ నాయక్ జాగీరు గ్రామం యాపర్లలోని పాఠశాలలో 1909 నుంచి 1923 మధ్య పండితులుగా పనిచేసిన అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి కుల వ్యవస్థను విమర్శిస్తూ ‘విద్వద్దంపతి విలాసము’ అనే కావ్యాన్ని రచించారు.
అమరచింత సంస్థానాన్నే ఆత్మకూరు సంస్థానంగా కూడా పేర్కొంటారు. ఈ వంశ రాజైన రెండవ సోమభూపాల రావు ఆత్మకూరులో విద్వత్సభలు జరిపి కవి పండితులను సన్మానించేవారు. ఆయన కుమారుడు సీతారామభూపాల రావు సుదీర్ఘకాలం పరిపాలించారు. ‘బాల సరస్వతి’, ‘తర్కతీర్థ’ బిరుదాంకితులు తిరుమల బుక్కపట్టణం శ్రీనివాసాచార్యులు ఆయన ఆస్థాన పండితు లు. తిరుపతి వేంకట కవులతో శ్రీనివాసాచార్యులుకు వాగ్వాదం జరిగింది. రసజ్ఞులకు ఆహ్లాదాన్ని పంచిన ఆ వాదోపవాదాల్లో తిరుపతి వేంకట కవులు ఓటమిపాలయ్యారు. అయినా ఆస్థాన పండితుల ఆమోదంతో తిరుపతి వేంకట కవులకు గజోత్సవం నిర్వహించారు సీతారామభూపాలుడు. భూదాన చంద్రహారాదులతో, వేయి నూట పదహార్లతో సత్కరించారు. ఆ సందర్భంగా ‘ఏనుగు నెక్కినాము, ధరణీంద్రుడు మ్రొక్కగ నిక్కినాము, స/ న్మానములందినాము, బహుమానములన్ గ్రహియించినాము’ అని తమ సంతోషాన్ని ప్రకటించారు తిరుపతి వేంకట కవులు. సీతారాంభూపాల రావు కోరిన మీదట హెసదుర్గం కృష్ణమాచార్యులు రచించిన ‘శ్రీనివాస విలాస’ కావ్యాన్ని వారు అనువదించారు. రామభూపాలరావు కాలంలోను, ఆయన భార్య రాణీ భాగ్యలక్ష్మీ దేవి పరిపాలనా కాలంలోను అమరచింత సంస్థానంలో విద్వత్సభలు ఘనంగా జరిగాయి.
గుంటూరు ప్రాంతానికి చెందిన కార్యమపూడి రాజమన్నారు కవి అమరచింత సంస్థానాన్ని సందర్శించారు. ‘సీతారామభూపాల విలాసము’ను రచించారు. అనంతపురం జిల్లా పోతురాయి గ్రామ వాస్తవ్యులు అల్లసాని రామనాథశర్మ ఆత్మకూరు సంస్థానాన్ని సందర్శించి, అష్టావధానం చేసి, రాణి ద్వారా సత్కారాన్ని పొందారు.
వనపర్తి ప్రాంతంలో వనపర్తి, అమరచింత సంస్థానాలతో పాటు చిన్న సంస్థానాలైన గోపాలపేట, ఆలంపూర్ కూడా సాహిత్య సౌరభాలను వెదజల్లాయి. వనపర్తి సంస్థాన ప్రభువు గోపాలరావు పేరిట నిర్మితమైన గ్రామమే గోపాలపేట. జనుంపల్లి వంశస్థులైన వనపర్తి సంస్థాన ప్రభు సంతతివారే గోపాలపేట సంస్థానాన్ని పరిపాలించారు. ఇతోధికంగా సాహిత్యరంగాన్ని పోషించారు. రాజా జగ్పాల్రావు కాలంలో పల్లా నరసింహ శాస్త్రి, బుక్కపట్నం రాఘవాచార్యులు, కేశవపంతుల సిం గయ్య సిద్ధాంతి, కాకునూరి అప్పకవి మొదలైనవారిని ఆదరించారు. వ్యాకరణ పండితులు బుక్కపట్నం రాఘవాచార్యుల తనయులు రామచంద్రాచార్యులు శతావధానిగానే కాకుండా శతాధిక గ్రంథకర్తగా పేరొందారు.
‘ఆనంద రామాయణం’, ‘బభ్రు వాహన’, ‘సురుచి’, సత్యరామ వ్రత కల్పము’, ‘లక్షణ పరిణయము’ మొదలైన గ్రంథాలను ఆయన రచించారు. వాటిలో ‘ఆనంద రామాయణము’ అముద్రితం. రాఘవాచార్యుల రెండో కుమారులు రంగాచార్యులు సాహిత్య సంగీతాల్లో రాణించారు. కేశంపేటలో జరిగే జాతరల్లో కవి గాయకులను రాణీ రంగనాయకమ్మ సత్కరించేవారు.
తెలంగాణలో అచ్చు యంత్రం లేని కాలంలో వనపర్తి సంస్థానాధీశులు ‘బ్రహ్మ విద్యా విలాస ముద్రాక్షర శాల’ అనే పేరుతో ముద్రణ చేపట్టారు. వనపర్తితో పాటు అమరచింత, గోపాలపేట తదితర సంస్థానాల ప్రభువులు కవులను, పండితులను ఎంతగానో ప్రోత్సహించారు. సాహిత్య వికాసానికి బాటలు వేశారు.
– సూర్యప్రకాశ్రావు రాయారావు
94410 46839