అక్షరం ఎంత మందిని ప్రభావితం చేయగల్గిందన్నదే ఆ అక్షరాన్ని సజీవంగా ఉంచుతుంది. ఆ సజీవ అక్షరం ఏనుగు నరసింహారెడ్డి కవితా సంకలనం ‘కొత్త పలక’లో ఉన్నది. ఇందులో మొత్తం 52 కవితలున్నాయి. వాటిలో ముఖ్యంగా ‘ఆరునూర్ల పది (610)’ ‘కొత్త పలక’, ‘ఒక ఊరు’, ‘వాళ్ళు కష్ట పడ్డార్సార్’, ‘బతికి పొండ్రి’, ‘వలస కాలం’, ‘107 బస్టాప్’.. మొదలైన కవితలు తెలంగాణ జనజీవితాన్ని చిత్రిక కట్టి చూపాయి.
‘పెద్దన్నలూ.. మీ పేరే రాష్ర్టానికి తగిలించినందుకు/ దర్పం ఉండొచ్చు కానీ ధర్మం లేదు; 610 పట్ల ఆగ్రహం ఉండొచ్చు కానీ/ జీవోలో ధర్మం లేదు; మలుపుకొన్న కాల్వల వల్ల వచ్చిన/ పంటల పచ్చదనం ఉండొచ్చు కానీ.. కన్నీటి వెచ్చదనం తెల్వదు; అంతంత పెద్ద మనుషులు/ కౌరవుల్లా నూర్గురు…’ ఈ కవితను చదివితే దాని నేపథ్యం ఏ పరిస్థితులను ప్రతిబింబిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
‘హైదరాబాద్ ఫ్రీ జోన్ (14ఎఫ్), ఆరు సూత్రాల పథకాన్ని ఆంధ్రులు అంగట్లో పెట్టినట్లు, అక్రమ డిప్యుటేషన్లు అంతులేని చొరబాట్లు..’ అంటూ సీమాంధ్ర ఉద్యోగుల అక్ర మ నియామకాలను ‘ఆరునూర్ల పది’ కవితలో ప్రశ్నిస్తాడు.
‘అ ఆలు నేర్పించడానికి ముందు/ తంగేడు చెట్టుకు వేసిన, మొగ్గంత స్వల్పమని/జీవితం గురించిన పాఠాలు చెప్పింది పలక, కోపు బలపంతో/ కొత్త పలక మీద రాస్తుంటే, ఉన్నట్లుండి/ నాలుగంటలకు పెట్టే ఉప్మా గుర్తొచ్చి, ఊహల మర్రి చెట్టుకు/ ఊయలలూగేది మనసు, చూచిరాతలు, ఎత్తిరాతలు/ ఎన్ని నేర్పింది పలక! రాసి రాసీ.. బండి ‘ఱ’ మీద నుంచి దూకితేనే కాని/ కరడాల కాపీకి అర్హతొచ్చేది, ఇప్పుడొక పలక దొరికితే బాగుండు/ చెరిపి రాయాల్సిన జీవితపు పాఠాలు.. చాలా గుర్తుకొస్తున్నాయి…’ ‘కొత్త పలక’.
ఇక పలక విషయానికి వస్తే.. ఇప్పటి మాదిరిగా ఐరన్ స్లేట్ తెల్వదు. సిమెంట్ పలక చుట్టూరా ఫ్రేమ్ కట్టి ఉండే ది. పొరపాటున జారిపడితే అంతే సంగతులు. ముక్కలుగా పగిలిపోయేది. మళ్ళీ కొత్త పలక రావాలంటే ఇంట్లో యుద్ధమే జరిగేది. కొత్త పలక మీద ‘కోపు’ అంటే బలపంతో రాస్తుంటే కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. మాష్టారు ఆ పలకపైన అ,ఆలు, దీర్ఘాలు, గుణింతాలు, ఎక్కాలు పెట్టించి దిద్దమని చెప్పేవాడు. నాకైతే ఐదో తరగతి వరకు నావెంట పలక ఉన్నట్లుగా గుర్తుంది.
ఇక ‘పలక’పై అ నుంచి ఱ వరకు సొంతంగా రాస్తేనే కరడాల కాపీకి ప్రమోషన్ వచ్చేది. ఏదో పదిమెట్లు ఒకేసారి ఎక్కిన ఆనందం కలిగేది. నిజమే.. ‘ఇప్పుడొక కొత్త పలక దొరికితే బావుండు… చెరిపి రాయాల్సిన జీవితపు పాఠాలు చాలా గుర్తుకొస్తున్నాయి’. జీవితాన్ని మార్చిన పలక కదా మరి.
‘ఊరు గొప్పతనం ఊరు గోడలు చెప్తాయ్’ అన్నట్లు.. పల్లెల్లోకి ప్రపంచీకరణ పైత్యం ప్రవేశించిన తర్వాత పల్లెటూర్ల రూపురేఖలు మారిపోయినయ్. మంచినీళ్లు దొరకని చోట థమ్సప్, సోడా సీసాలు దొరుకుతున్నయ్. ‘వెనుకట ఇక్కడొక ఊరుండేది/ మనుషులకి రక్షణ కవచంగా, గుంపులు గుంపులుగా చెట్ల సమూహం/ ఆకాశంలో తిరగాడే నల్లమబ్బులకి వలపు బాణాలొదిలేవీ, మొగురాలు పిల్లర్లు కాకముందు/ అరుగుల చోట పార్కింగ్లు రాకముందు, విశాలమైన పెంకుటిం డ్లు/ఇరుకు ఇందిరమ్మ పెయింటింగులు కట్టక ముందు.. ఇక్కడొక ఊరుండేది ఎవరైనా చూపిస్తారా..?’ ‘ఒక ఊరు’ కవిత.
ఊర్లో ఏ ఇంటికి వెళ్లినా మొగురం కనిపించేది. నేడు కాంక్రీటు పిల్లర్లు వచ్చినయ్. విశాలమైన పెంకుటిల్లు స్థానంలో సిమెంట్ స్లాబు ఇండ్లు నిలిచి నయ్. అం టే పల్లెలు క్రమంగా హృదయంలేని కాంక్రీట్ వనాలుగా మారిపోతున్నయ్.
ఏనుగు నరసింహారెడ్డి కలం నుంచి జాలువారిన ‘కొత్త పలక’ కవితా సంపుటిలో ఒక్కొక్క కవిత ఒక్కో అంశాన్ని ఉద్దేశించి రాయబడినది. జీవితసారాన్ని సమాజాన్ని వివిధ కోణాల్లో సూక్ష్మంగా పరిశీలిస్తే తప్ప ఇటువంటి కవితలు రాయడం సాధ్యం కాదు. ‘కొత్త పలక’ కవితా సంపుటిపై జి.అంజనీబాయి ఎం.ఫిల్ చేయటం గొప్ప విషయం. మనిషి జీవితాన్ని మార్చేది భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేది పాఠశాల అయితే, ఆ పాఠశాలలో తొలి అక్షరాలు దిద్దేది మాత్రం ‘కొత్త పలక’ పైనే. ‘కొత్త పలక’ జ్ఞాపకాలే కాదు, చూపిన దారిలో దార్శనికతతో ముందుకుపోదాం.
– డాక్టర్ మహ్మద్ హసేన
99080 59234