తెలంగాణ చరిత్ర, శాసనాలపై పరిశోధనలు చేస్తూ ఆర్కియాలజీ విభాగంలో పని చేసిన పీవీ పరబ్రహ్మశాస్త్రి ఎన్నో కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చాడు. శాతవాహనుల మొదటి రాజధాని కోటిలింగాల అని, సిముక శాతవాహనుడు ధూళికట్ట మీదనే శత్రువును చంపి కోటిలింగాలలో రాజయ్యాడని పరబ్రహ్మశాస్త్రి తన పరిశోధనలతో నిరూపించారు. ఈ విధంగానే కాకతీయ శాసనాలను కొన్నింటిని తీసుకొని వాటిని వివరిస్తూ పుస్తకంగా ప్రచురించాడు.
తెలంగాణలో మరొక గొప్ప చారిత్రక పరిశోధకుడు బి.ఎన్.శాస్త్రి. ఆయన ఎటువంటి ప్రభుత్వసంస్థల ఆర్థిక సహాయం లేకుండానే స్వయంగా తెలంగాణలోని గ్రామగ్రామాన తిరిగి శాసనాలు, నాణేల సమాచారాన్ని సేకరించాడు. విష్ణుకుండినుల రాజధాని నల్లగొండ జిల్లాలోని ‘తుమ్మలగూడెం’ అని, అదే నాటి ‘ఇంద్రపాలనగరం’ అని అక్కడ దొరికిన శాసనం ద్వారా నిరూపించాడు. 400 వరకు శాసనాలను సేకరించి ఆయా రాజవంశాల చరిత్రను గ్రంథాల్లో చేర్చాడు. వేములవాడ చాళుక్యుల చరిత్రను రచించి తెలంగాణ సాహిత్య ప్రాచీనతను వెలుగులోకి తెచ్చాడు. ఈ విధంగా ఎంతోమంది మహామహులు, చరిత్ర పరిశోధకులు, సంఘసంస్కర్తలు తెలంగాణ సమాజ గౌరవాన్ని కాపాడి తెలంగాణ చరిత్ర ప్రాచీనతను, వైభవాన్ని, సాహితీ సౌరభాన్ని బయటపెట్టారు. మరిచిపోయిన పోతన, సోమన, మొల్ల, అప్పకవి మనవారే అని నిరూపించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపారు. ప్రజలను స్వాతంత్య్ర పోరాటోన్ముఖులుగా చేశారు. ఇలాంటి వారినే మనం తెలంగాణ వైతాళికులుగా చెప్పుకొంటున్నాం.
ఆంధ్ర మహాసభలు, వైతాళికుల మేలుకొలుపులతో ప్రజలు చైతన్యవంతులయ్యారు. దొరల ఆగడాలను వ్యతిరేకించి నిజాం పాలన నుంచి విముక్తి కావాలని.. ఏకం కావటం మొదలుపెట్టారు. కమ్యూనిస్టు పార్టీ ప్రభావంతో గ్రామగ్రామాన ప్రజలు ‘సంఘం’గా ఏర్పడి దొరలనెదిరించి పోరాడసాగారు. ‘సంఘం’నే.. సామాన్య పరిభాషలో ‘సంగం’ అని పిలిచేవారు. మరోవైపు ఆర్యసమాజం రజాకార్లను ఎదిరిస్తూ నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపింది. కాంగ్రెస్వాళ్లు గాంధీజీ మార్గంలో శాంతియుతంగా పోరాటం చేశారు. 1946 జూలై 4న కడివెండిలో విసునూరు రామచంద్రారెడ్డి దొర గూండాలు పేల్చిన తుపాకీ గుండు తగిలి ఊరేగింపులో ఉన్న దొడ్డి కొమురయ్య మరణించాడు. ఈ సంఘటనతో ప్రజల్లో మరింతగా నిజాం వ్యతిరేక ఉద్యమాలు ఉధృతమయ్యాయి. బండి యాదగిరి, సుద్దాల హనుమంతు వంటి వారు నిజాంను వ్యతిరేకిస్తూ పాటలు కట్టి పాడారు. అవి విపరీతంగా ప్రజల్లో వ్యాపించాయి.
‘నైజాం సరుకరోడా.., నాజీల మించినోడ ఏమి బాధలు పెడ్తివి కొడుకో నైజాం సరుకరోడ’ అని బండి యాదగిరి కట్టిన పాట పోరాటానికి బావుటా అయ్యింది. నిజాం తన ఆస్తులనంతా పదహారు బండ్లలో నింపుకొని సరిహద్దులు దాటి పారిపోతున్నాడని వార్త వ్యాపించింది. దాన్ని విని యాదగిరి ఈ పాట కట్టాడు.
‘గోలకొండ కిల్లాకింద నీ గోరి కడ్తం కొడుకో నైజాం సర్కరోడ..’ అన్న యాదగిరి పాటలు ప్రజల భాషలో ఉండి ఆకట్టుకున్నాయి. అలాగే.. ‘పల్లెటూరి పిల్లగాడా.. పసులగాసే మొనగాడా..’ అంటూ సుద్దాల హనుమంతు దొరల వెట్టిచాకిరితో ఎద్దుల కొట్టంలో కరిగిపోతున్న బాల్యాన్ని చిత్రిస్తూ పాట కట్టాడు.
‘నైజాము సర్కారురా ఓరన్న/ నరకాసురుని మించెరా ఏ మూల జూసినా హింసలు, హత్యలు/ ఏ మూలజూడ గృహదహనాలు దోపిళ్లు నరరూప రాక్షసుడురా నైజాము/ నైజమేదో తెలిసెరా..’ అని సుద్దాల తన పాటలతో ప్రజలను మేల్కొలిపాడు.
‘రణభేరి మోగింది తెలుగోడ
రావోయి ముందుకు మొనగాడ..
అర్ధరాత్రి మారణాయుధాలతో వచ్చి
పల్లెటూళ్లను చుట్టి ప్రజలందరి బట్టి
చింత బరిగెలతోడ తెలుగోడ, వీపు
చిట్ల గొడుతున్నరు మొనగాడ..’
తెలుగు వీరులు బాలచంద్రులై పోరాడాలని సుద్దాల అంటాడు.
‘భూమి కోసం భుక్తి కోసం
శ్రమకు తగిన ఫలితం కోసం
దొరతనం, భూస్వామ్య విధానం
దోపిడీ నిర్మూలన కోసం
రైతు నీవు ఏకమై
పోరాటము చేయగ రావోయి వ్యవసాయ కూలీ..’ అంటూ పోరాటానికి సుద్దాల పిలుపునిచ్చాడు.
ముదిగంటి ,సుజాతారెడ్డి
99634 31606