హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఖజానాకు రూ.231.22 కోట్ల నష్టం కలిగించిన బోధన్ నకిలీ చలాన్ల కుంభకోణం కేసులో 34 మందిని నిందితులుగా చేర్చినట్టు సీఐడీ ఏడీజీ మహేశ్ భగవత్ సోమవారం వెల్లడించారు. వారిలో 23 మంది వాణిజ్యపన్నుల శాఖకు చెందిన అధికారులే ఉన్నారని వివరించారు. 123 మందిని సాక్షులుగా చేర్చినట్టు తెలిపారు. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరిపిన సీఐడీ అధికారులు ఈ నెల 11న కరీంనగర్లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేసినట్టు చెప్పారు.
ఈ కేసుకు సంబంధించి 68 సాఫ్ట్వేర్ ఆబ్జెక్టులు, 143 డాక్యుమెంట్లు, 3 ఆడిట్ రిపోర్టులను కోర్టుకు సమర్పించినట్టు వివరించారు. ఇదిలా ఉండగా, ఈ కేసులో అభియోగాలు ఎదురొంటున్న వాణిజ్యపన్నుల శాఖ అధికారుల్లో కొందరు ఇప్పటికే పదవీ విరమణ చేశారు. 2012 నుంచి ఈ కుంభకోణం జరుగుతుండగా, 2017 ఫిబ్రవరి 2న వెలుగులోకి వచ్చింది. దీనిపై అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.