జగిత్యాల రూరల్, మార్చి 11: కంచే చేను మేసిన చందంగా ఖాతాదారుల సొత్తును కంటికి రెప్పలా కాపాడాల్సిన బ్యాంక్ మేనేజర్, మరో ఉద్యోగి కలిసి ఇల్లు లాంటి బ్యాంకుకే కన్నమేశారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వంద నకిలీ ఖాతాలు సృష్టించారు. అక్షరాలా కోటీ పదిహేను లక్షల 42 రూపాయలను దారి మళ్లించి జేబు నింపుకొన్నారు. మోసాన్ని గుర్తించిన బ్యాం క్ ఉన్నతాధికారులు ఇద్దరిని సస్పెండ్ చేశారు. బ్యాంక్ ప్రస్తుత మేనేజర్ ఫిర్యాదుపై ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు జగిత్యాల రూరల్ ఎస్ఐ అనిల్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్కు చెందిన సుమన్ జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్గా విధులు నిర్వహిస్తుండేవాడు. రాయికల్ మండలం చింతలూర్ గ్రామానికి చెందిన రాజేశ్ ఇదే బ్యాంకులో క్యాషియిర్ కమ్ క్లర్క్గా పనిచేసేవాడు. మూడేండ్లుగా మేనేజర్గా పనిచేసిన సమయంలోనే క్లర్క్తో కలిసి మోసానికి తెరలేపాడు. వంద మంది మహిళా సంఘ సభ్యుల పేరిట నకిలీ ఖాతాలు సృష్టించారు. మహిళా సంఘాల ఖాతాదారులు, రైతులు ఖాతాల్లో నగదు డిపాజిట్లు, విత్డ్రాల సమయంలోనే వారిని గందరగోళానికి గురిచేశారు. డిపాజిట్, విత్డ్రా సమయాల్లో రసీదులు ఇవ్వకపోవడం, ఖాతా బుక్ ప్రింట్ చేయమని అడిగినా ఇచ్చేవారు కాదు. ఖాతాదారుల అసలు ఖాతా నుంచి అక్రమంగా నగదును నకిలీ ఖాతాలకు మళ్లించేవారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం అందించే రుణాలను సదరు నకిలీ ఖాతాల్లోకి మల్లించారు. నకిలీ ఖాతాల్లోంచి డబ్బును మేనేజర్, క్లర్క్లు కలిసి తమ జేబులో వేసుకునేవారు. ఇలా ఏకంగా రూ. 1.15కోట్ల స్కామ్ చేసి సదరు మొత్తాన్ని స్వాహా చేశారు. చల్గల్ గ్రామానికి చెందిన ఓ పొదుపు సంఘానికి చెందిన మహిళ తాను తీసుకున్న రూ.5లక్షల రుణాన్ని పూర్తిగా చెల్లించింది. ఇంకా రూ.2లక్షలు చెల్లించాలని సదరు మహిళకు రెండు నెలల క్రితం బ్యాంకు అధికారులు సమాచారం అందించారు. తాను రుణాన్ని మొత్తం చెల్లించానని, బ్యాంక్ మేనేజర్ సుమన్, క్లర్క్ కలిసి మోసం చేశారని సదరు మహిళ బ్యాంక్ ఉన్నతాధికారులు, జగిత్యాల డీఆర్డీఏ అధికారులకు రెండు నెలల క్రితం ఫిర్యాదు చేసింది. దీంతో పలువురు ఖాతాదారులు బ్యాంకుకు వెళ్లి వివరాలు తెలుసుకోవడంతో ఖాతాల్లోంచి డబ్బులు మాయమైన విషయం తెలిసింది. విషయం బయటకు పొక్కడంతో వీరిద్దరి వ్యవహారం బ్యాంక్ ఉన్నతాధికారులకు తెలిసింది. దీంతో స్పందించిన బ్యాంకు ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. మేనేజర్, క్లర్క్ కలిసి రూ.1.15 కోట్ల మేర స్కాం చేసినట్లు గుర్తించి వారిని రెండు నెలల క్రితం సస్పెండ్ చేశారు. నకిలీ ఖాతాలు సృష్టించి మోసగించిన వారిపై చల్గల్ యూబీఐ ప్రస్తుత మేనేజర్ మోతీలాల్ ఫిర్యాదు మేరకు శుక్రవారం ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ అనిల్ తెలిపారు.