హైదరాబాద్ : తెలంగాణ వీరనారి, సాయుధ పోరాట యోధురాలు చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు మంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిసి, ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఐలమ్మ కుటుంబ సభ్యులు పొటోలు దిగారు. అనంతరం సీఎం కేసీఆర్ వారితో మాట్లాడారు.
ఐలమ్మ చరిత్రను కూడా రికార్డు చేయాలని, వారికి.. కుటుంబానికి సంబంధించిన వివరాలు మరిన్ని కావాలని చెప్పారు. తెలంగాణ వచ్చాకే ఐలమ్మకు తగిన గుర్తింపు, గౌరవం దక్కిందని, ఇందుకు తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ గారికి రుణపడి ఉంటామని ఐలమ్మ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ను కలిసేలా ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రి ఎర్రబెల్లికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఐలమ్మ కుటుంబీకులు పాలకుర్తి మాజీ సర్పంచ్ చిట్యాల రామచంద్రం, చిట్యాల సంపత్, చిట్యాల శ్వేత పాల్గొన్నారు.