హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో అద్దె బస్సు డ్రైవర్లకు శిక్షణను తప్పనిసరి చేస్తూ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. సురక్షిత ప్రయాణానికి మారుపేరైన టీఎస్ఆర్టీసీలో ఇటీవలికాలంలో అద్దె బస్సుల డ్రైవర్లు అతివేగం గా వెళ్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించినట్టు తెలిపారు. అద్దె బస్సుల యజమానులు డ్రైవర్లకు టీఎస్ఆర్టీసీ శిక్షణా కేంద్రాలైన హకీంపేట లేదా వరంగల్లో తప్పక శిక్షణ ఇప్పించాలని, ఈ ఆదేశాలు యుద్ధప్రాతిపదికన అమలు చేయాలని ఆదేశించారు. లేదంటే బస్సుల యజమానుల ఒప్పందాలు రద్దు చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.
ఆన్లైన్లోనూ జర్నలిస్టులకు రాయితీపై బస్టికెట్: ఆర్టీసీ ఎండీ
జర్నలిస్టులకు టీఎస్ఆర్టీసీ అందిస్తున్న బస్పాస్ సదుపాయాన్ని ఇకపై ఆన్లైన్లోనూ వినియోగించుకోవచ్చని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. సంస్థ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునే జర్నలిస్టులు రాయితీని (కన్సెషన్) పొందవచ్చని శుక్రవారం ట్వీట్ చేశారు.