జీడిమెట్ల, జనవరి 5 : రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మోడలోనుంచి బంగారు గొలుసు అపహరణకు గురైన సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీడిమెట్ల సీఐ కె.బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం… చింతల్ మహేంద్రసింగ్నగర్కు చెందిన లత స్థానికంగా టైలర్ దుకాణం నిర్వహిస్తుంది. మంగళవారం రాత్రి ఇంటి నుంచి టైలర్ దుకాణం వైపు నడుచుకుంటూ వెళ్తుండగా ఎదురుగా స్కూటీపై వచ్చిన అగంతకుడు లత మెడలో ఉన్న 2.5 తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అడ్రస్ అడిగి.. ఆభరణాలతో పరార్
కేపీహెచ్బీ కాలనీ, జనవరి 5 : అపార్ట్మెంట్లోకి వచ్చిన ఓ వ్యక్తి.. ఒంటరిగా ఉన్న మహిళను చిరునామా అడిగినట్లు నటించి ఆమె మెడలోని బంగారు గొలుసును తస్కరించుకొని పారిపోయాడు. కేపీహెచ్బీ కాలనీ సీఐ కిషన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా ఆత్మకూర్ మండలానికి చెందిన ఏనుగు పద్మజారెడ్డి (45), ఏనుగు వెంకటేశ్వర్ రెడ్డి దంపతులు కేపీహెచ్బీ కాలనీ 2వ రోడ్డులోని ఎంఐజీ 449లో సాయిపవన్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి పద్మజారెడ్డి స్కూల్ ఫంక్షన్కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తూ.. కూరగాయలు, మందులు తీసుకుని అపార్ట్మెంట్లోకి వెళ్లింది. అప్పటికే అపార్ట్మెంట్లో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి పద్మజారెడ్డికి ఎదురుపడి సత్యనారాయణ అనే వ్యక్తి ఉన్నాడా.. అని అడిగాడు. ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించి ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడు, నల్లపూసల దండ, బంగారు ఆభరణాలను బలవంతంగా లాక్కుని పారిపోయాడు. ఈ విషయమై బాధితురాలు కేపీహెచ్బీకాలనీ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.