దుబ్బాక, ఫిబ్రవరి 2: తెలంగాణ హైకోర్టు జడ్జిగా దుబ్బాక చాడ విజయ భాస్కర్రెడ్డి నియమితులయ్యారు. హైకోర్టుకు 12 మంది జడ్జిలను నియమిస్తూ సుప్రీం కోర్టు (న్యాయ మూర్తుల సంఘం) కొలీజియం ప్రతిపాదించిన జడ్జిల వివరాల జాబితాను మంగళవారం రాష్ట్రపతికి సిపార్సు చేసినట్లు సమాచారం. సోమవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తుల కొలీజియం నిర్వహించిన సమావేశంలో తెలంగాణ హైకోర్టు 12 మంది న్యాయ మూర్తులను ఎంపిక చేసి ఆ జాబితాను రాష్ట్రపతికి అందజేసింది. ఈ జాబితాలో ఉన్న 7 మంది అడ్వకేట్లు నేరుగా జడ్జిలుగా నియమితులయ్యారు. మరో ఐదుగురు పదోన్నతితో జడ్జిలుగా అయ్యారు. కోలిజియం జాబితాలో హైకోర్టు న్యాయవాది దుబ్బాకకు చెందిన చాడ విజయ భాస్కర్రెడ్డి నియామకమయ్యారు. ఆయన 20 ఏండ్లుగా హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. విజయ భాస్కర్రెడ్డి నియామకంపై దుబ్బాక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయ భాస్కర్రెడ్డి సోదరుడు చాడ లక్ష్మీనారాయణ దుబ్బాక వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) మాజీ చైర్మన్, ప్రస్తుతం టీఆర్ఎస్ నాయకులు. తన సోదరుడు విజయ భాస్కర్రెడ్డి హైకోర్టు జడ్జిగా కొలీజియం ప్రతిపాదనలపై చాడ లక్ష్మీనారాయణ సంతోషం వ్యక్తం చేశారు.