రాజన్న సిరిసిల్ల, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ ధనం కావాలె.. కానీ, ధాన్యం వద్దంటున్న కేంద్రం రెండు నాల్కల ధోరణిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మాట సాయం తప్ప తెలంగాణకు నయాపైసా సాయం చేయలేదు’ అని మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. బీజేపీ నేతల దొంగ మాటలు నమ్మి మోసపోవద్దని రైతులకు విజ్ఞప్తిచేశారు. యాసంగి ధాన్యం కొనే మాట నిజమైతే రాతపూర్వకంగా ఆదేశాలు తేవాలని, లేదంటే మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి రెండు చెంపలు పగుల గొట్టండని బీజేపీ కార్యకర్తలకు హితవుపలికారు. బుధవారం సిరిసిల్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. రైతులను మోసం చేస్తున్న బండి సంజ య్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ధర్నా చౌక్లో గురువారం చేపడుతున్న మహాధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు.
యాసంగి ధాన్యం కొనబోమన్న అంశంపై కేంద్రం పునఃసమీక్షించుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు. రాజ్యాంగం ప్రకారం రాష్ర్టాలకు కేంద్రం వెన్నుదన్నుగా ఉండాలన్న విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ వ్యవసాయ రంగానికి కేంద్రం చేసిందేమీ లేదని విమర్శించారు. వ్యవసాయానికి ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నదని స్పష్టంచేశారు. కాలంతో పోటీపడి కాళేశ్వరం నిర్మించామని పునరుద్ఘాటించారు. తెలంగాణ రైతులు దేశానికే అన్నం పెట్టే స్థితిలో ఉన్నారన్నారు. వ్యవసాయం రంగంలో దేశంలోనే తెలంగాణ నంబర్వన్ అని చెప్పిన ఎఫ్సీఐకి.. ఇక్కడి ధాన్యాన్ని కొనేందుకు ఎందుకు మనసు రావట్లేదని ప్రశ్నించారు. యాసంగి ధాన్యం కొంటామని కేంద్రం రాతపూర్వక ఆదేశాలు ఇచ్చేదాక ఆందోళన కొనసాగిస్తామని స్పష్టంచేశారు. సమావేశంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య ఉన్నారు.
జవహర్నగర్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు విద్యార్థులను తన కాన్వాయ్లోని వాహనంలో దవాఖానకు తరలించి మంత్రి కేటీఆర్ నిండు ప్రాణాలను కాపాడారు. సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వస్తుండగా హకీంపేట వద్ద మియాపూర్కు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. ఘటనను చూసిన మంత్రి కేటీఆర్ స్వయంగా వాహనం దిగి సిబ్బంది సాయంతో వారిని దవాఖానకు పంపించారు. అక్కడ ఉన్న వాహనదారులు మంత్రి కేటీఆర్ మానవత్వాన్ని అభినందించారు.
రాష్ట్రవ్యాప్తంగా 4,743 కొనుగోలు కేంద్రాల ద్వారా వానకాలం ధాన్యం సేకరిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 253 కేంద్రాల ద్వారా ఇప్పటికే 52 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు స్పష్టంచేశారు. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని కొనాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.