న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంటున్నది. జీఎస్టీ ఎత్తివేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల కేంద్రం ప్రకటించిన మూడో విడుత వ్యాక్సినేషన్ వ్యూహంపై అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుసున్నది. ప్రజలపై భారం తగ్గించేందుకు టీకాలపై వస్తు సేవల పన్నులను మాఫీ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రేటును తగ్గించడం ద్వారా ప్రైవేటులో వ్యాక్సినేషన్ను ప్రోత్సహించే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఇప్పటికే కరోనా చికిత్స మందుల తయారీకి వినియోగించే అవసరమైన ముడి పదార్థాలపై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం ఇప్పటికే మాఫీ చేసింది. ఇదే తరహాలో వ్యాక్సిన్లపై సైతం ఐదు శాతం జీఎస్టీని రద్దు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే, దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వ్యాక్సిన్లపై జీఎస్టీ మాఫీకి కౌన్సిల్ అనుమతి అవసరం. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రజలకు సైతం ఉపశమనం కలిగించే ఈ నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించే అవకాశం లేదని ఓ అధికారి పేర్కొన్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం మే ఒకటో తేదీ నుంచి చేపట్టాల్సిన మూడో విడుత వ్యాక్సినేషన్ కోసం సరళీకృత, వేగవంతమైన వ్యూహాన్ని ప్రకటించింది. ఇందులో టీకా కంపెనీలు ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లలో 50శాతం రాష్ట్ర ప్రభుత్వాలకు, బహిరంగ మార్కెట్లో విడుదల చేసేందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పుణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) కొవిషీల్డ్ వ్యాక్సిన్ను రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400, ప్రైవేటు హాస్పిటళ్లకు రూ.600 సరఫరా చేయనున్నట్లు ఈ నెల 21న ప్రకటించింది.
అలాగే హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ సైతం ఈ నెల 24న వ్యాక్సిన్ ధరలను ప్రకటించింది. కొవాగ్జిన్ను రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.600, ప్రైవేటు హాస్పిటల్స్కు రూ.1200 సరఫరా చేయనున్నట్లు పేర్కొంది. రెండు కంపెనీల వ్యాక్సిన్లలో ఏది మొదటి డోసు తీసుకున్నా ఎనిమిది వారాల వ్యవధిలో రెండో మోతాదు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ల ధరలపై వచ్చిన విమర్శల నేపథ్యంలో సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ ధరపై కాస్త వెనక్కి తగ్గింది. రాష్ట్రాలకు సరఫరా చేసే వ్యాక్సిన్ ధరను రూ.400 నుంచి రూ.300కు తగ్గించింది. దీంతో రాష్ట్రాలకు భారీగా నిధులు ఆదా కావడంతో పాటు మరింత కొందరికి టీకాలు వేసి ప్రాణాలు కాపాడొచ్చని సీరం సీఈఓ అదర్ పూనావాలా పేర్కొన్నారు.
రెండు వ్యాక్సిన్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి రూ.150కే సరఫరా చేయనున్నాయి. 45 ఏళ్లు దాటిన వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం టీకాలు ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఇదిలా ఉండగా.. దీనిపై ఫైనాన్షియల్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ క్లియర్ టాక్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆర్కిత్ గుప్తా స్పందిస్తూ.. జీఎస్టీ మినహాయింపు ఇస్తే ప్రభుత్వాలకు ఖర్చులు తగ్గుతాయన్నారు. అలాగే ప్రైవేటులో టీకాలు కొనుగోలు చేసేలా ఎక్కువ మందిని ప్రోత్సహించే అవకాశం ఉందన్నారు. ఈ నిర్ణయం కచ్చితంగా రోగ నిరోధక శక్తిని పెంచుతుందని, సంక్షోభం నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..