న్యూఢిల్లీ: కరోనా ఉత్పాతంతో దేశం మృతభూమిగా మారుతున్నది. సెకండ్వేవ్లో లక్షలాదిమంది పిట్టల్లా రాలిపోతున్నారు. అయినప్పటికీ కేంద్రంలో ని బీజేపీ సర్కారుకు ఇదేమీ పట్టలేదు. వైరస్ కట్టడి లో భాగంగా వ్యాక్సిన్ అభివృద్ధికి పీఎం కేర్స్ ఫండ్ నుంచి రూ. 100 కోట్ల సాయం చేస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించిన ప్రధాని కార్యాలయం ఆ తర్వాత ఆ సంగతే మరిచిపోయింది. దేశంలో అత్యవసర పరిస్థితులు, క్లిష్ట సమయాల్లో నిధులను వినియోగించడానికి ప్రధాని మోదీ ఈ ‘పీఎం కేర్స్ ఫండ్’ను ఏర్పాటు చేశారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే నిధులతోనే అంటే ఒకవిధంగా ప్రజల డబ్బుతోనే ఈ ఫండ్ నడుస్తున్నది. కేంద్రం అదనంగా ఒక్క పైసా కూడా దీనికి వెచ్చించనక్కర్లేదు. అయినప్పటికీ, మ హమ్మారితో ప్రజలందరూ ప్రాణాలు విడుస్తున్నప్పటికీ, మోదీ సర్కారు మాత్రం వేడుక చూస్తూ కూర్చున్నది. టీకా అభివృద్ధికి ఇస్తామన్న సొమ్మును రాల్చలేదు.
నాలుగు నెలల తర్వాత స్పందన
కొవిడ్ టీకా అభివృద్ధికి పీఎం కేర్స్ ఫండ్ నుంచి విడుదల చేసిన నిధుల వివరాలు తెలియజేయాలంటూ ప్రముఖ హక్కుల కార్యకర్త లోకేశ్ బాత్రా ఆర్టీఐ ద్వారా కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కు జూలై 16, 2021న ఓ దరఖాస్తు పంపారు. చివరకు నాలుగు నెలల తర్వాత ఆరోగ్యశాఖ సమాధానం ఇచ్చింది.