హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా వివక్ష చూపుతున్నది. అడవి బిడ్డల కోసం కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ ద్వారా దేశవ్యాప్తంగా ప్రారంభించిన వన్ధన్ వికాస కేంద్రాల విషయంలోనూ అన్యాయమే చేస్తున్నది. మూడేండ్ల క్రితం రాష్ర్టానికి కేవలం 17 వన్ధన్ వికాస కేంద్రాలను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఆ తర్వాత కనీసం ఒక్క కేంద్రాన్ని కూడా మంజూరు చేయలేదు. కేంద్ర గిరిజన సంక్షేమ సంక్షేమశాఖ మంత్రి రేణుకా సింగ్ సరుతా సోమవారం పార్లమెంట్ సాక్షిగా ఈ విషయాన్ని ఒప్పుకొన్నారు. దేశంలోని అడవి బిడ్డల కోసం కేంద్ర గిరిజన సంక్షేమశాఖ చేపడుతున్న చర్యలేమిటి? రాష్ర్టాలవారీగా వన్ధన్ వికాస కేంద్రాల పరిస్థితి ఏమిటి? అని లోక్సభలో ఎంపీలు విజయ్కుమార్ దూబే, రేబటి త్రిపుర, అనురాగ్శర్మ అడిగిన ప్రశ్నలకు మంత్రి రేణుకాసింగ్ సరుతా ఇచ్చిన సమాధానం తెలంగాణలోని గిరి జనులకు తీవ్ర విస్మయాన్ని కలిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1,126 వన్ధన్ వికాస కేంద్రాల (క్లస్టర్ల)ను ఏర్పాటు చేశామని, వాటిలో తెలంగాణకు 17 క్లస్టర్లను కేటాయించామని కేంద్ర మంత్రి చెప్పారు. ఆ తర్వాత రెండేండ్లలో దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1,984 వన్ధన్ వికాస కేంద్రాల్లో తెలంగాణకు ఒక్క కేంద్రాన్ని కూడా కేటాయించలేదని స్పష్టం చేశారు. అనాదిగా గిరిజనులు అడవుల నుంచి చిన్నతరహా అటవీ ఫలసాయాలను సేకరించటం, వాటిని విక్రయించటం ద్వారా జీవనం సాగిస్తున్నారు. వారికి ఆధునిక మెళకువలు నేర్పి శాశ్వత ఉపాధిని చూపించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వన్ధన్ వికాస కేంద్రాలను ఏర్పాటు చేసింది.