ఓ సాధారణ ఉప ఎన్నిక జరిగే నియోజవకర్గానికి మూడు కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు సరిపోతాయి! కానీ.. ఈసీ ఏకంగా 20 కంపెనీలను పంపించింది! ఎందుకు? ఏ ఉప ఎన్నికకూ లేనివిధంగా ఒకే నియోజకవర్గానికి నలుగురు వ్యయ పరిశీలకులను ఈసీ పంపిస్తున్నది! ఎందుకు? తాను ఓడిపోతానేమోనని బీజేపీ భయపడే ఎన్నికల్లో ఈసీ అతిగా జోక్యం చేసుకోవటం.. ఎందుకు? బీజేపీ సభలకు గుర్తురాని కరోనా మహమ్మారి.. టీఆర్ఎస్ సభలప్పుడే ఈసీకి గుర్తొస్తున్నది.. ఎందుకు? ఇది ఈసీ అత్యుత్సాహమేనా? లేక ఈసీని తోలు బొమ్మలా ఆడిస్తున్న బీజేపీ కుట్రలా?
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేతిలో ఈసీ కీలుబొమ్మగా మారిందా? బీజేపీ పెద్దలు ఆదేశిస్తే.. ఈసీ తు.చ. తప్పకుండా పాటిస్తున్నదా? గతంలో తాను చేసిన నిర్ణయాలకు తూచ్ అంటూ తిలోదకాలిస్తున్నదా? అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఎన్నికలన్నాక పార్టీలు పోటీ పడతాయి.. ప్రచారం చేస్తాయి. ప్రజలు ఆదరించినవారు గెలుస్తారు.. తిరస్కరించినవారు ఓడుతారు. రాజకీయాల్లో అత్యంత సహజమైన, సాధారణమైన విషయంలో బీజేపీ ఎందుకు ఇంత దిగజారుతున్నదనే ప్రశ్న తలెత్తుతున్నది. అందులోనూ ఒక్క ఉప ఎన్నిక కోసం ప్రజాస్వామ్యానికి ఇంతగా తిలోదకాలు వదలడమా? ఓటమి తథ్యమని తేలిపోవడంతో ఏది చేసైనా గెలిచేందుకు.. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని కుట్రలు చేయాలా? ఇది రాజకీయమా? అరాచకంతో కూడిన అరాజకీయమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపును అడ్డుకునేందుకు బీజేపీ తన శక్తికి మించి ప్రయత్నం చేస్తున్నదని, ఈసీని అడ్డు పెట్టుకొని కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నదని పలువురు విమర్శిస్తున్నారు. నిన్నటికి నిన్న సీఎం కేసీఆర్ సభను అడ్డుకునే కుట్ర చేసిన బీజేపీ.. తాజాగా మరో పెద్ద కుట్రకు తెరతీసింది. గతంలో ఏ ఉప ఎన్నికకు లేనివిధంగా ఇద్దరు వ్యయ పరిశీలకులను (అబ్జర్వర్) ఈసీ నియమించింది. ఇప్పటికే ఒక సాధారణ పరిశీలకుడిని, ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా మరొకరిని, పోలీస్ అబ్జర్వర్గా ఇంకొకరని సీఈసీ నియమించింది. వారు చాలరు అనుకున్నదేమో.. తాజాగా మరో వ్యయ పరిశీలకుడిని నియమిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఇలా అదనపు వ్యయ పరిశీలకుడిని నియమించడం చాలా అరుదు అని అధికారవర్గాలు కూడా విశ్లేషిస్తున్నాయి.
హుజూరాబాద్కు మూడు కంపెనీల కేంద్ర బలగాలను పంపించాలని తొలుత ఈసీ నిర్ణయించింది. కానీ మొత్తం 20 కంపెనీల బలగాలను పంపిస్తున్నట్టు తాజాగా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంత భారీ సంఖ్యలో బలగాలు పంపించడంపై పోలీసు వర్గాలు సైతం విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. ఉగ్రవాద, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలకు మాత్రమే ఈ తరహా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తారు. ఏపీలోని కడప జిల్లా ఫ్యాక్షనిస్టు ప్రభావిత ప్రాంతం. అక్కడి బద్వేలుకు కూడా ఉప ఎన్నిక జరుగుతున్నది. అక్కడికి 15 కంపెనీల కేంద్ర బలగాలను పంపిన ఈసీ.. ప్రశాంతమైన తెలంగాణలో ఉప ఎన్నికకు 20 కంపెనీల బలగాలను పంపడం వెనుక రహస్య ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? అన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఒక్కో కంపెనీలో సుమారుగా 120 మంది పోలీసులు ఉంటారు. అంటే 20 కంపెనీల్లో సుమారు 2,400 మంది! హుజూరాబాద్లో 2 లక్షలకు పైచిలుకు ఓటర్లు ఉన్నారు. అంటే.. ప్రతి 83 మందికి ఒక కేంద్ర సాయుధ పోలీసు ఉంటారన్నమాట. వీరికి రాష్ట్ర పోలీసు బలగాలు అదనం. ఇంత భారీ సంఖ్యలో కేంద్ర బలగాలను పంపడంతో ఈసీకి రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదా? రాష్ట్ర పోలీసులు సమర్థులు కాకపోతే శాంతిభద్రతలు ఎందుకు ప్రశాంతంగా ఉన్నాయి? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా రాజకీయ కుట్రలో భాగంగానే ఈ పని చేశారనే పలువురు అంటున్నారు.
హుజూరాబాద్కు అనుకొని ఉన్న హుస్నాబాద్లో అక్టోబర్ 3న బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించింది. దీనికి సాక్షాత్తు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పాటు బీజేపీకి చెందిన ముఖ్యనేతలంతా హాజరయ్యారు. నోటిఫికేషన్ జారీ తర్వాతే బీజేపీ ఈ సభను నిర్వహించినా ఈసీ నోరు మెదపలేదు. ఎప్పుడేతే సీఎం కేసీఆర్ బహిరంగ సభను పెంచికల్పేటలో నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించిందో.. అప్పుడే ఈసీకి కరోనా నిబంధనలు, ఎన్నికల నియమావళి గుర్తొచ్చాయి. అంతే.. హుజూరాబాద్తో పాటు చుట్టు పక్కల నియోజకవర్గాల్లోనూ ఎలాంటి బహిరంగ సభలు పెట్టొద్దని గురువారం ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి పెంచికల్పేట హనుమకొండ జిల్లా పరిధిలోకి వస్తుంది. హుజూరాబాద్తో గానీ, కరీంనగర్ జిల్లాతో గానీ ఈ గ్రామానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ.. సీఎం కేసీఆర్ సభతో బీజేపీ ఓటమి తథ్యమని ఈసీ భావించిందో ఏమోగానీ.. వెంటనే ఫర్మానా జారీ అయిపోయింది.
ఈటల రాజీనామా చేసిన తర్వాత బీజేపీ ప్రలోభాలు కూడా మొదలయ్యాయి. బొట్టు బిళ్లలు మొదలుకుని, గడియారాలు, కుట్టుమిషన్లు ప్రజలకు యథేచ్ఛగా పంచారు. వాటి ఫొటోలు మీడియాలో కూడా వచ్చాయి. ఈటలకు అనుకూలమైన ఓ మీడియా సంస్థ వాహనంలో డబ్బు పట్టుబడిందని కూడా వార్తలు వచ్చాయి. ఈటల శిబిరం నిర్వహించిన దసరా విందులు, క్వార్టర్ బాటిళ్ల పందేరాలు సరేసరి. వీటన్నింటిపై ఇప్పటికీ ఈసీ ఒక్క చర్య కూడా తీసుకున్న దాఖలాలు లేవు. కానీ.. ఎప్పుడో ఆగస్టులో ప్రారంభమై, అమలవుతున్న దళితబంధు పథకాన్ని నిలిపేస్తూ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దళితబంధును ఆపేయాలంటూ బీజేపీ నేత ప్రేమేందర్రెడ్డి ఈసీకి లేఖ రాసిన వెంటనే ఈసీ ఈ పథకాన్ని నిలిపివేయడం గమనార్హం. తాజాగా సీఎం సభను అడ్డుకోవటానికి ఆదేశాలు జారీచేసింది. ఇప్పుడు వ్యయ పరిశీలకులను పెంచడమే కాకుండా ఏకంగా 20 కంపెనీల కేంద్ర బలగాలను పంపాలని నిర్ణయం తీసుకున్నది.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం అతిగా వ్యవహరిస్తుందనే విమర్శలకు దాని చర్యలు మరింత బలం చేకూర్చుతున్నాయని పలువురు అంటున్నారు. స్వతంత్రంగా పని చేయడం మానేసి.. ఎవరో చెప్పినట్టు నడుచుకుంటున్నదనే అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొంటున్నారు. దేశంలో హుజూరాబాద్తోపాటు 30 అసెంబ్లీ స్థానాలకు, మూడు పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. సీఈసీ మాత్రం ఒక్క హుజూరాబాద్పైనే తన దృష్టిని కేంద్రీకృతం చేసిందనే వాదన వినిపిస్తున్నది. ఫిర్యాదులు అందిందే తడువుగా.. దానిలో మంచిచెడ్డలు కూడా చూడకుండానే.. వాయువేగంతో నిర్ణయాలు తీసుకోవటమే కాకుండా.. అంతే వేగంతో వాటిని అమలు చేస్తున్నదని పలువురు అంటున్నారు. ఎన్నికల సంఘం తీరు ‘టూ మచ్’గా ఉన్నదని అంటున్నారు.
ఈసీ స్వతంత్రంగా పనిచేసుకునేలా కేంద్రం వ్యవహరించాలి. దాని నిర్ణయాలపై ఒత్తిడి తేవడం సరికాదు. కేం ద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఎన్నికల కమిషన్ను ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ర్టాల్లో ఇతర పార్టీలు అధికారంలో ఉంటే ఇలా చేస్తున్నాయి. సభలు, సమావేశాలు పెట్టుకోవడం పార్టీల హక్కు. వాటిని కూడా కాలరాస్తామనడం సరికాదు. ఇలాంటి చర్యల ద్వారా ప్రజలకు ఎన్నికల కమిషన్ మీద ఏవగింపు కలుగుతుంది. హుజూరాబాద్ లో దళిత బంధును ఆపడం కుట్ర పూరిత చర్య.
–మల్లేపల్లి లక్ష్మయ్య
ఎన్నికల కమిషన్ రాజ్యాం గ బద్ధంగా వ్యవహరించాలి. ఎన్నికల కోడ్ను అమలు చే యడానికి కొన్ని నియమ నిబంధనలున్నాయి. ఈసీ కూ డా రాజ్యాంగ నియమాలు, సూత్రాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉం టుంది. కరోనా రూల్స్ అమల్లో ఉన్నా.. ఇతర రాష్ర్టాల్లో దానికి విరుద్ధంగా కూడా జరిగాయి. ఇప్పటికే అమలైన దళితబంధును నిలిపివేయడం అ న్యాయం. దళితబంధును ఆపాల్సిన అవసరం లే దు. ఈసీ నిర్ణయం సరైంది కాదు. హుజూరాబాద్ లో ఇతర సంక్షేమ పథకాలూ అమలవుతున్నాయి.
–ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ