హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వడం లేదని, విభజన చట్టం హామీలను అమలు చేయడం లేదని ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన జరిగి 8 ఏండ్లు దాటినా ఇంతవరకు హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్రం దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదని, 157 నర్సింగ్ కాలేజీల్లోనూ రాష్ర్టానికి అన్యాయం జరిగినా గవర్నర్ ప్రస్తావించలేదని అన్నారు. ఎఫ్ఆర్బీఎం పరిధిని పెంచకపోవడం దారుణమని వాపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను విస్మరించిందని, నీతిఆయోగ్ సిఫార్సులను అమలు చేయడం లేదని పేర్కొన్నారు. నీటిపారుదల, విద్యుత్తు ప్రాజెక్టులకు అనుమతులు, కృష్ణా జలాల్లో వాటా తేల్చడంలో ఆలస్యం చేస్తున్నదని కేంద్రంపై విరుచుకుపడ్డారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని, మంత్రి కేటీఆర్ వివిధ దేశాల ద్వారా పెట్టుబడులు తీసుకొస్తున్నారని వివరించారు. రాష్ర్టంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గవర్నర్ ప్రసంగంలో పూర్తిస్థాయిలో ప్రతిబింబించలేదన్నారు.
మంత్రి కేటీఆర్కు ప్రశంసలు
మంత్రి కేటీఆర్ అద్భుతంగా పనిచేస్తున్నారని, ఇటీవల దావోస్లో పర్యటించి రూ.కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని అక్బరుద్దీన్ ప్ర శంసించారు. టీఆర్ఎస్ నుంచి భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) గా మారిన సందర్భంగా అభినందనలు తెలిపారు.
కేటీఆర్, అక్బరుద్దీన్ మధ్య స్వల్ప సంవాదం
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్, మంత్రి కేటీఆర్ మధ్య స్వల్ప సంవాదం జరిగింది. గొంతు చించుకొన్నంత మాత్రాన సరిపోదని, రెండేండ్లుగా కరోనా కారణంగా అసెంబ్లీ సమావేశాలు తక్కువ జరిగిన విషయం మరచిపోయినట్టు ఉన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఏడుగురు సభ్యులున్న పార్టీకి ఇంత సమయం ఇస్తే, 105 మంది ఉన్న తమ పార్టీ సభ్యులకు ఎంత సమయం ఇవ్వాలో స్పీకర్ ఆలోచించాలని సూచించారు. సభ్యులు సమయపాలన పాటించేలా చూడాలని స్పీకర్కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.