న్యూఢిల్లీ, నవంబర్ 3: దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురవడంతో మోదీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఫలితాలు వెలువడిన మరుసటి రోజే పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. కొన్ని నెలలుగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డుస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. రోజూ పెట్రోబాదుడు ఫలితంగా మిగతా ధరలకూ రెక్కలు రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇన్నాళ్లూ పెట్రోల్, డీజిల్పై జనాన్ని బాదినంత బాదేసిన కేంద్రం ఇప్పుడు కంటితుడుపుగా తగ్గించింది. కొంతమేర తగ్గే పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం నుంచి అమలులోకి వస్తాయి. యాసంగి సీజన్ను దృష్టిలో ఉంచుకొని పెట్రోల్ కంటే డీజిల్పై రూ.5 అదనంగా ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినట్టు కేంద్రం పేర్కొంది. బుధవారం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.114.47, డీజిల్ ధర రూ.107.37గా ఉంది.
పెంచింది ఎంత… తగ్గించింది ఎంత?
గతేడాది మార్చి నుంచి మే మధ్యలోనే లీటర్ పెట్రోల్పై రూ.13, డీజిల్పై రూ.16 ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం పెంచింది. కేంద్రం గతేడాది మే 5న ఎక్సైజ్ సుంకాన్ని రికార్డుస్థాయిలో పెంచినప్పటి నుంచి చూస్తే పెట్రోల్ లీటర్కు రూ.38.78, డీజిల్ లీటర్కు రూ.29.03 పెరిగాయి. ఇన్నాళ్లూ జనం నుంచి ముక్కుపిండి వసూలు చేసిన మొత్తంతో చూస్తే కేంద్రం ఇప్పుడు తగ్గించిన ఐదూ, పదీ కంటితుడుపేనన్న అసంతృప్తి వ్యక్తమవుతున్నది. కేంద్ర ఆర్థిక శాఖలో సీజీఏ డాటా ప్రకారం… 2021 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కేంద్రం ఎక్సైజ్ వసూళ్లు భారీగా పెరిగి రూ.1.71 లక్షల కోట్లకు చేరింది. దానికి ముందు ఆర్థిక సంవత్సరంలో అదే కాలానికి కేంద్రానికి ఎక్సైజ్ వసూళ్లు రూ.1.28 లక్షల కోట్లు లభించింది. 2019 రాబడితో పోలిస్తే ఇది 79 శాతం ఎక్కువ. పెట్రోల్, డీజిల్పై పన్ను వసూళ్లు 88 శాతం పెరిగి రూ.3.35 లక్షల కోట్లకు చేరాయని కేంద్రమే జూలైలో ప్రకటించింది.
అప్పుడెంత? ఇప్పుడెంత?
ప్రధానిగా మోదీ తొలిసారి పగ్గాలు చేపట్టిన మే, 2014లో అంతర్జాతీయ విపణిలో బ్యారెల్ క్రూడాయిల్ ధర 109.21 డాలర్లుగా ఉన్నది. అప్పుడు దేశంలో లీటరు పెట్రోల్ రూ.72.26. కరోనా సమయంలో బ్యారెల్ క్రూడాయిల్ ధర 19.90 డాలర్లకు తగ్గింది. అయితే, లీటరు పెట్రోల్ ధర మాత్రం రూ.79.30కు పెరిగింది. క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు అందుకు అనుగుణంగా స్థానిక మార్కెట్లలో ఇంధన ధరలు తగ్గాలి. అయితే, తగ్గిన ఇంధన ధరల స్థానంలో సుంకాలను ఇబ్బడిముబ్బడిగా పెంచి.. సామాన్యులకు బదలాయించాల్సిన ఆ మొత్తాన్ని కేంద్రం ఖజానాకు మళ్లించింది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడాయిల్ ధర 82 డాలర్లుగా ఉన్నప్పటికీ, దేశంలో లీటరు పెట్రోల్ రూ.120 వరకు ఉంది.