ఆదిలాబాద్: ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా చేపట్టిన ఆదిలాబాద్ కొనసాగుతున్నది. ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) యూనిట్ను పునఃప్రారంభించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా సీసీఐపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సీసీఐ సాధన కమిటీ ఆదిలాబాద్ పట్టణ బందుకు పిలుపునిచ్చింది. దీంతో కమిటీ సభ్యులు ఉదయం నుంచే ఆర్టీసీ బస్ డిపో ముందు బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. బందుకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నది. పట్టణంలో విద్యా, వాణిజ్య, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.
వేలాది మందికి ఉపాధి కల్పించే సీసీఐ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సాధన కమిటీ సభ్యులు మండిపడ్డారు. సిమెంట్ పరిశ్రమ ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించినప్పటికీ.. కేంద్రంలని బీజేపీ సర్కారు మాత్రం పరిశ్రమ భూములను అమ్మడానికి ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) యూనిట్ పునఃప్రారంభానికి చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, మహేంద్రనాథ్ పాండేలకు గత నెలలో లేఖ రాశారు. తెలంగాణలోనేకాదు దేశీయంగా కూడా సిమెంటుకు భారీ డిమాండ్ ఉందని చెప్పారు. దేశంలోని ప్రైవేటు సిమెంటు కంపెనీలు భారీ లాభాలు ఆర్జిస్తున్నాయని చెప్పారు. సీసీఐ కంపెనీ పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని స్పష్టం చేశారు.
కంపెనీని ప్రారంభిస్తామంటే ప్రోత్సాహకాలు, వెసులుబాటు కల్పిస్తామని వెల్లడించారు. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని కలిసి విజ్ఞప్తి చేశామని, అటునుంది ఇప్పటివరకు ఎలాంటి స్పందనా లేదని చెప్పారు. తాము ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తుంటే.. కేంద్రం మాత్రం సీసీఐ లాంటి కంపెనీలను తెరవకుండా ఉపాధి అవకాశాలను దెబ్బ కొడుతున్నదని విమర్శించారు.
కేంద్రం మొండి వైఖరితో ఆదిలాబాద్ యువతకు తీరని ద్రోహం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీసీఐ తెరిస్తే ఆదిలాబాద్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కంపెనీ పునఃప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.