హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పేపర్లు లీక్ కావటంతో మన రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న పదో పరగతి పరీక్షలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించాలని నిర్ణయించారు.
ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయనున్నారు. సీసీ కెమెరాను చీఫ్ సూపరింటెండెంట్ గదిలో బిగించి, సీల్ చేసిన ప్రశ్నపత్రాలను ఓపెన్ చేస్తున్నప్పుడు రికార్డు చేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన సీసీటీవీల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశారు. పరీక్షల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సీసీ కెమెరాల వినియోగంపై జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.
పదో తరగతి హాల్టికెట్లు, ముద్రించిన నామినల్ రోల్స్ను ఇప్పటికే స్కూళ్లకు పంపించారు. విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి హాల్ టికెట్లు పొందవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. హాల్టికెట్లను www.bse.telangana.gov.in వెబ్సైట్లోనూ పొందుపరిచామని, గురువారం నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా, పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు డిజిటల్ క్లాసులను కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 20 వరకు క్లాసులు కొనసాగనున్నాయి.