న్యూఢిల్లీ, అక్టోబర్ 18: సీబీఎస్ఈ 10, 12 తరగతుల టర్మ్-1 పరీక్షలు నవంబర్, డిసెంబర్ నెలల్లో జరుగనున్నాయి. 10వ తరగతి పరీక్షలు నవంబర్ 30న ప్రారంభమై డిసెంబర్ 11న ముగుస్తాయి. 12వ తరగతి పరీక్షలు డిసెంబర్ 1న మొదలై 22 వరకు వరకు కొనసాగుతాయి. విద్యార్థులకు సాధ్యమైనంత వరకు వారి సొంత పాఠశాలలనే పరీక్షా కేంద్రాలుగా కేటాయించనున్నట్లు సీబీఎస్ఈ పరీక్షల కంట్రోలర్ ఎస్ భరద్వాజ్ తెలిపారు. శీతాకాలం దృష్ట్యా పరీక్షలు ఉదయం 10.30 గంటలకు కాకుండా 11.30 గంటలకు ప్రారంభమవుతాయి. ప్రశ్న పత్రాలను చదివేందుకు విద్యార్థులకు 20 నిమిషాల సమయం ఇస్తారు. టర్మ్-1 పేపర్లలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలే ఉంటాయి. ప్రతి పేపర్ గడువు 90 నిమిషాలు. బోర్డు పరీక్షల సబ్జెక్టులను మైనర్, మేజర్ అని రెండు గ్రూపులుగా సీబీఎస్ఈ విభజించింది. మొదట మైనర్ పేపర్ల పరీక్షలు, తర్వాత మేజర్ పేపర్ల పరీక్షలు నిర్వహిస్తుంది. ప్రాక్టికల్ పరీక్షలు, ఇంటర్నల్ అసెస్మెంట్, ప్రాజెక్ట్ వర్క్ 50 శాతం మార్కులకు ఉంటాయి. వీటిని టర్మ్-1 పరీక్షలు ముగిసేలోగా పాఠశాలలు పూర్తి చేస్తాయని సీబీఎస్ఈ తెలిపింది. మైనర్ సబ్జెక్టుల పరీక్షలు 10వ తరగతికి నవంబర్ 17న, 12వ తరగతికి నవంబర్ 16న మొదలవుతాయి. ఈ పరీక్షలను బోర్డు ప్రశ్నపత్రాలతో పాఠశాలలే నిర్వహిస్తాయి.