న్యూఢిల్లీ, డిసెంబర్ 6: మాటలు కోటలు దాటుతయ్.. చేతలు గడప కూడా దాటవన్న సామెత రైతుల విషయంలో ప్రస్తుత కేంద్రప్రభుత్వానికి కచ్చితంగా సరిపోతుంది. వ్యవసాయ పథకాలకు కేంద్రంలో బీజేపీ ప్రభు త్వం కేటాయిస్తున్న నిధులు, బడ్జెట్ ప్రసంగాలు ఉట్టి వాగాడంబరమేనని అవే బడ్జెట్ గణాంకాలు కుండబద్ధలు కొడుతున్నాయి. ‘రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం’ అని పదే పదే ప్రకటించే కేంద్రప్రభుత్వం.. రైతుల కోసం బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో సగం కూడా ఖర్చు చేయడం లేదు. ఇది ఒకటి రెండు సందర్భాల్లో కాదు, బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిపాటిగా మారిపోయింది. గడిచిన ఐదేండ్లలో వ్యవసాయ రంగానికి కేంద్రం కేటాయించిన నిధులు, వాస్తవంగా చేసిన ఖర్చు వివరాలను పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లం అవుతుంది.
ప్రధాన పథకాలకు కూడా
ఎరువుల వినియోగంలో ప్రాంతాలను బట్టి ప్రమాణాల రూపకల్పనకు ఎంతో కీలకమైన సాయిల్ హెల్త్ టెస్టులు, మట్టి నాణ్యత నిర్వహణ కార్యక్రమాలకు గడిచిన ఐదేండ్లలో ప్రతిపాదించిన నిధుల్లో కేంద్రప్రభుత్వం కనీసం సగం కూడా విడుదల చేయలేదు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి కోసం, భూగర్భ జలాలను కాపాడటం కోసం ఉద్దేశించిన కృషి సించయ్ పథకానికి కేటాయించిన వాటిలో ఖర్చు చేసింది కేవలం 62 శాతం మాత్రమే. గణాంకాలు ఇలా ఉంటే.. రైతుల వ్యవసాయ ఖర్చులను తగ్గించేందుకు రాష్ర్టాలు చర్యలు తీసుకోవాలని, అందుకు కేంద్ర పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలను ఉపయోగించుకోవాలని అదే బీజేపీ సర్కారు ఉచిత సలహాలు ఇవ్వడం విడ్డూరం.