హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున బీఆర్ఎస్ కార్యకర్తలపై , పోలీసు అధికారులపై అనుచితంగా, అసభ్యకరంగా దుర్భాషలాడిన కాంగ్రెస్ నాయకులపై కేసులు నమోదు చేసి( Cases) అరెస్టు చేయాలని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ( RS Praveen Kumar )డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సైఫాబాద్ పోలీస్ హెడ్క్వార్టర్స్లో అదనపు డీజీపీకి ఒక వినతి పత్రాన్ని అందజేశారు.
మిర్యాలగూడ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ( Jagga Reddy ) , నిజామాబాద్లో ఎంపీ ధర్మపురి అరవింద్, మిగతాచోట్ల దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ నాయకులపై కేసులు నమోదు చేయాలని, వారిపై పీడీయాక్ట్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అబ్బాస్, మాజీద్ అనే ఇద్దరు రౌడీషీటర్లను వెంట బెట్టుకుని మిర్యాలగూడలో పోలీంగ్ కేంద్రం వద్ద సీఐ శివకుమార్ యాదవ్ను ఘోరంగా అవమాన పరిచాడని, రాష్ట్రపతి అవార్డు గ్రహిత అయిన సీఐపై నానా దుర్భాషలాడరని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి అండతోనే కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో పోలీసు శాఖ ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నైని బొగ్గు గని విషయంలో విలేకరులను ఆగమేఘాల మీద అరెస్టు చేయించిన రేవంత్ రెడ్డి పోలీసులను దూషించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, రౌడీషీటర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. జగ్గారెడ్డి మీద సూమోటో కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలనలో 89 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అతలంకుతలం అవుతుందని విమర్శించారు. శుక్రవారం మున్సిపల్ కౌంటింగ్ రోజున కాంగ్రెస్ నాయకులు అక్రమాలకు పాల్పడేందుకు కౌంటింగ్ ఏజెంట్లను, బీఆర్ఎస్ అభ్యర్థులను కిడ్నాప్ చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ నాయకులకు అభ్యర్థులకు భద్రత కల్పించాలని పోలీసులను కోరినట్లు ఆయన వెల్లడించారు.
కేసీఆర్ హయాంలో పోలీసులపై ఏనాడు కూడా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసభ్యకరంగా మాట్లాడలేదని పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు వాహనాల ఏర్పాటు, ప్రపంచ స్థాయి సౌకర్యాలు , రూ.7 వందల కోట్లతో కమాండ్ కంట్రోల్ రూం, 10లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసు శాఖ ప్రతిష్టను పెంచారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి మాత్రం కుట్రతో సిట్ల మీద సిట్లను ఏర్పాటు చేసి పోలీసులపైనే దాడులను చేయిస్తున్నారని మండిపడ్డారు.