అమరావతి : ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ( Ambati Rambabu ) పై పోలీసులు కేసు ( Police Case ) నమోదు చేశారు. బుధవారం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ( YS Jagan ) సత్తెనపల్లి మండలం రెంటపాళల్లో వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి పోలీసులు పరిమిత వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు.
అయితే పరిమితి దాటి పోవడంతో కొర్రపాడు వద్ద పోలీసులు బారికేడ్డు ఏర్పాటు చేసి వాహనాలను నిలిపివేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న అంబటి, తన సోదరుడు మురళి, కార్యకర్తలు బారికేడ్ల వద్ద ఉన్న పోలీసులను నిలదీశారు. వారితో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో బారికేడ్లను తోసేసి పోలీసులను నెట్టివేశారు. ఈ సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించి దాడి చేశారంటూ 188,332, 353, 427 సెక్షన్ల కింద అంబటిపై సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అదే విధంగా జగన్ పర్యటనలో నిబంధనలు అతిక్రమించారన్న కారణంగా సత్తెనపల్లి పట్టణ పోలీసులు వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు.